Don't Miss!
- News అష్టదిగ్బంధనం - బీఆర్ఎస్ భవిష్యత్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
హీరో కులానికి చెందినవారే...: కృష్ణ వంశీ ఆవేదన
హైదరాబాద్ : ''సినిమా అనేది ఈ రోజు కులాల ప్రాతిపదికన విడిపోయింది. ఫలానా హీరో సినిమాని ఆ కులానికి చెందిన వ్యక్తులే చూస్తున్నారు. మిగిలినవాళ్లూ చూస్తారు. కానీ 'ఆ సినిమా బాలేదు..' అని చెప్పడానికే'' అంటూ ఆవేదనగా చెప్పుకొచ్చారు ప్రముఖ దర్శకులు కృష్ణవంశీ . ఆయన దర్శకత్వంలో ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై రమేష్ పుప్పాల నిర్మించిన 'పైసా' ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కృష్ణవంశీ మీడియాతో పలు విషయాలు ముచ్చటించారు.
కృష్ణ వంశీ మాట్లాడుతూ.... పోస్టర్ చూసి ఇది మా కులపోడి సినిమానే అనే మైండ్సెట్తో సినిమాకొచ్చే ప్రేక్షకుల్ని మనం ఏమనగలం?. అలాంటి లెక్కలతో ప్రేక్షకులు సినిమాలకొస్తున్నారు. ఆ స్థాయిలో సమాజం విషపూరితమైపోయింది. మొత్తం వ్యవస్థే నిర్వీర్యమైపోతోంది. ప్రేక్షకుల్లో హీరో వర్షిప్ ఎక్కువైపోయింది. ఆధ్యాత్మికంగా, సాంస్కతికంగా ప్రపంచానికే తలమానికంగా నిలిచిన దేశం మనది. కానీ మన దౌర్భాగ్యం ఏమిటంటే అనాదిగా ఇక్కడి ప్రజలు బానిస మనస్తత్వానికి అలవాటుపడ్డారు. అలనాడు రాజుల్ని దైవాంశ సంభూతులుగా కొలిచారు. తర్వాత బ్రిటీష్వాడు మనపై ఆజమాయిషీ చేశాడు. ఇప్పుడు గొప్ప ప్రజాస్వామిక దేశమని చెప్పుకుంటున్నా... పరోక్షంగా రాచరికం తరహాలోనే ప్రజలు పాలించబడుతున్నారు. అన్ని రంగాల్లో ఇదే ధోరణి వుంది. సినిమా రంగం అందుకు మినహాయింపు కాదు అన్నారు.
దర్శకుడిగా తాను ఈ చిత్రంతో పూర్తి సంతృప్తిగా ఉన్నానని, సాధారణ సినిమాల్లా కాకుండా కొత్తగా ఏదన్నా ప్రయత్నిద్దామని చేసిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు మెల్ల మెల్లగా ఆదరిస్తున్నారని, త్వరలో స్పీడు కూడా అందుకుని ఎక్కువ రోజులు ఆడుతుందన్న నమ్మకం ఉందన్నారు. మూడు టేకుల్లో డబ్బు దొరికిన సన్నివేశంలో నాని నటనకు మంచి మార్కు లు పడుతున్నాయని, రాజా రవీంద్ర పాత్రకు, సాయి కార్తీక్ సంగీతానికి, హైదరాబాద్ నటుల నటన ఈ చిత్రానికి హైలెట్ అని ఆయన అన్నారు.
అలాగే... ''సాధారణంగా నా సినిమాల్ని థియేటర్లో చూడను. సినిమాని ప్రేమించి తీస్తా కదా? థియేటర్లో దాని గురించి ఎవరైనా కామెంట్ చేసినా, ఇష్టపడి తీసిన పాట వస్తున్నప్పుడు ఎవరైనా లేచి వెళ్లిపోయినా బాధపడాల్సివస్తుంది. అందుకే 'సింధూరం' తరవాత నా సినిమాని థియేటర్లలో జనం మధ్య కూర్చుని చూడలేదు. చాలా కాలం తరవాత 'పైసా' అలా చూశా. ప్రేక్షకుల స్పందన కళ్లారా చూసినప్పుడు నిజంగా ఆనందం వేసింది. విశ్రాంతి సన్నివేశం ముందు నాని చెప్పిన సంభాషణ బాగా నచ్చింది. నటుడిగా నాని ఏమిటో ఆ సన్నివేశం చెప్పేసింది'' అన్నారు.
ఇక డిమాండ్ - పంపిణీ సూత్రాన్ని నమ్మాల్సిందే. టికెట్టు రేటుకి గిట్టుబాటయ్యే వినోదం అందించి న్యాయం చేయాలి. అంత మాత్రాన దిగజారాల్సిన అవసరం లేదు. సినిమా నా వృత్తి కాదు. ఇది నా జీవితం. సినిమా తప్ప మరోటి తెలీదు. నేను ఏం చెప్పదలచుకొన్నానో.. అది నలుగురితో పంచుకోవడానికి దీనిని ఓ సాధనంగా ఎంచుకొన్నా. నా ఆశయాల కోసం నిర్మాత డబ్బులతో ఆడుకోవడం కూడా నాకు నచ్చదు. అందుకే కొన్నిసార్లు కొన్ని వదులుకొని సినిమాలు తీయాలి. ఏం వదులుకొంటున్నావ్ అనేదానిని బట్టే.. దర్శకుడి నైపుణ్యం, సమాజంపై తనకున్న బాధ్యత ఏమిటో తెలుస్తుంది అన్నారు.
అలాగే...''డబ్బు ఎక్కడెక్కడ, ఏయే రంగాల్లో, ఎలా ప్రభావితం చేస్తుందో ఈ సినిమాలో చూపించా. ముందు నానితో మరో కథ చేద్దామనుకొన్నా. మూడు నెలల పాటు స్క్రిప్టు పనులు కూడా నడిచాయి. కానీ.. ఓరోజు ఆ కథపై బోర్ కొట్టింది. 'అదొద్దు.. ఈ కథ చేద్దాం' అని నానికి చెప్పా. తానూ వెంటనే ఒప్పుకొన్నాడు. అలా 'పైసా' పట్టాలెక్కింది. నిజానికి రెండు మూడు నెలల్లో ఈ సినిమా పూర్తి చేద్దామనుకొన్నా. కానీ ఏడాదిన్నర ఆలస్యమైంది. ఇలాంటి కారణాల వల్ల కూడా సినిమా ఆలస్యం అవుతుందా? అనిపించింది. ఈ సినిమా ఆగడానికి కారణాలేంటో ఇప్పుడు చెబితే బాగోదు. కొన్ని పేర్లు బయట పెట్టడం నాకు ఇష్టం లేదు. సీజీ వర్క్లో కొన్ని సన్నివేశాలు తీయాల్సివచ్చింది. అవి అస్సలు బాలేవు. కానీ తప్పదు. కొన్నిసార్లు రాజీ పడాలి'' అని వివరించారు.