కృష్ణ దు:ఖం ఆపడం ఎవరి వల్లా కాలేదు: నమ్రత, మహేష్ ఓదార్పు (ఫోటోస్)
ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల మరణం తెలుగు సినీ పరిశ్రమను విషాదంలోకి నెట్టివేసింది. అయితే కృష్ణ శోకాన్ని ఆపడం ఎవరి వల్లా కావడం లేదు. దాదాపు 50 సంవత్సరాల పాటు అర్దాంగిగా తనతో ప్రయాణం సాగించడమే కాకుండా తన సినీ కెరీర్లో కీలక భూమిక పోషించిన విజయ నిర్మల మరణాన్ని ఆయన తట్టుకోలేక పోతున్నారు.
భార్య భౌతిక కాయాన్ని చూస్తూ కృష్ణ కన్నీటి పర్యంతం అయ్యారు. సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఎంత ఓదార్చినా ఆయన శోకం నుంచి బయటకు రాలేక పోయారు. సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు విజయ నిర్మల భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

మామయ్యను ఓదార్చిన నమ్రత
భార్య మరణాన్ని తట్టుకోలేక కన్నీరు మున్నీరవుతున్న కృష్ణను.... ఆయన కోడలు నమ్రత ఓదార్చారు. అయితే తన సహచరి దూరం అయిన బాధలో ఉన్న సూపర్ స్టార్ ఆ దు:ఖాన్ని దిగమింగలేక బోరున విలపించారు. ఈ దృశ్యం అభిమానులను కలిచివేసింది.

ఇద్దరూ 47 చిత్రాల్లో కలిసి నటించారు
విజయ నిర్మల, కృష్ణ కలిసి దాదాపు 47 సినిమాల్లో హీరో హీరోయిన్లుగా నటించారు. వీరు జంటగా చేసిన తొలి చిత్రం ‘సాక్షి'. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఈ మూవీ విడుదలైన రెండేళ్ల తర్వాత తిరుపతిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.

నివాళులు అర్పించిన మహేష్ బాబు
విజయ నిర్మల మరణ వార్త తెలుసుకున్న వెంటనే మహేష్ బాబు... తన తండ్రి కృష్ణ నివాసానికి చేరుకుని నివాళులు అర్పించారు. సూపర్ స్టార్ ఇంటి వద్ద భారీగా అభిమానులు గుమిగూడారు. విజయ నిర్మల భౌతిక కాయాన్ని గురువారం మొత్తం అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. శుక్రవారం అంత్యక్రియలు చిలుకూరులోని ఫాంహౌస్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

విజయ నిర్మల
విజయ నిర్మల నట ప్రస్థానం 7 ఏళ్ల వయసులోనే మొదలైంది. హీరోయిన్గా 60కిపైగా చిత్రాల్లో నటించిన ఆమె.... దర్శకత్వంలోనూ తన ప్రతిభ చాటారు. 44 చిత్రాలకు దర్శకత్వం వహించి అత్యధిక చిత్రాలు డైరెక్ట్ చేసిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం దక్కించుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.


Click it and Unblock the Notifications











