కృష్ణంరాజు అంత్యక్రియల వేదిక మార్పు.. ఎప్పుడు? ఎక్కడ నిర్వహిస్తున్నారంటే?
ప్రఖ్యాత నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఆయన మన మధ్య ఇకలేరనే వార్త ఎందరినో దిగ్బ్రాంతికి గురిచేసింది. తెలుగు సినిమా పరిశ్రమ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు. అయితే ముందుగా అనుకొన్న ప్రదేశంలో కాకుండా వేరే ప్రాంతంలో కృష్ణంరాజు అంత్యక్రియలను నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకొన్నారు. కృష్ణంరాజు మరణానికి సంబంధించిన మరిన్ని వివరాలు మీకోసం..

తెలుగు సినీ ప్రపంచానికి షాక్
కృష్ణంరాజు మరణవార్త ఆదివారం ఉదయం అందర్ని కలిచివేసింది. తెల్లవారుజామున లేవగానే సినీ ప్రముఖులను, రాజకీయ నేతలను, సగటు ప్రేక్షకులు, అభిమానులను షాక్ గురిచేసింది. కృష్ణంరాజు మరణవార్తను నమ్మలేకపోయారు. సన్నిహితులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తెలుసుకొని పరామర్శించారు.

ప్రముఖుల సంతాపాలతో సోషల్ మీడియా
కృష్ణంరాజు మరణవార్తను వినగానే సినీ ప్రముఖులంతా సోషల్ మీడియా ద్వారా సంతాపాన్ని తెలిపారు. కృష్ణంరాజు ఘనతలు, సమాజ సేవ, రాజకీయ కార్యక్రమాలను పంచుకొన్నారు. సినీ ప్రముఖులు ప్రత్యేకంగా సంతాప ప్రకటనలు విడుదల చేసి ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకొన్నారు. అజాతశత్రువైన రెబల్ స్టార్ ఇకలేరే వార్తను జీర్ణించుకోలేకపోయారు.

ప్రభాస్ మనోధైర్యాన్ని కూడగట్టుకొని
పెదనాన్న కృష్ణంరాజు మరణంతో ప్రభాస్ కలతచెందాడు. మనోస్థైర్యాన్ని కూడగట్టుకొని తనను పరామర్శించడానికి వచ్చిన ప్రముఖులందరిని తన అక్కున చేర్చుకొన్నారు. తనకు తాను మానసికంగా సిద్దమై.. ఆయనను అభిమానించే వారికి మానసిక ధైర్యాన్ని ఇవ్వడం కనిపించింది. ప్రభాస్ చూపిన పరిణతిని చూసి అభిమానులు, సినీ ప్రముఖులు ఎమోషనల్ అయ్యారు.

ప్రముఖులంతా తరలివచ్చి..
ప్రభాస్ను పరామర్శించడానికి సినీ, రాజకీయ, వ్యాపారవర్గాలు తరలివచ్చారు. చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, నాని, రాఘవేంద్రరావు, వెంకటేష్, అల్లు అర్జున్, కేటీఆర్, తలసాని శ్రీనివాస్, కిషన్ రెడ్డి, ఇతర టీఆర్ఎస్, బీజేపీ నేతలు వచ్చి కృష్ణంరాజుకు శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మీడియా ముందు తమ అనుబంధాన్ని చెప్పుకొన్నారు.

ఇంటి వద్దనే అభిమానుల సందర్శనార్థం
అయితే కృష్ణంరాజు మరణం తర్వాత ఆయన పార్థీవదేహాన్ని ఎక్కడ పెట్టాలనే చర్చ జరిగింది. కృష్ణంరాజు ఇంటి వద్ద సరైన స్థలం లేకపోవడంతో ఏదైనా స్టేడియంకు తరలించాలని భావించారు. కానీ చివరకు కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆయన పార్తీవదేహాన్ని ఇంటి వద్దనే ఉంచారు. దాంతో సినీ ప్రముఖులు ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అయితే తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది.

అంత్యక్రియలు జరిగేది ఇక్కడే
ఇదిల ఉండగా, కృష్ణంరాజు అంత్యక్రియలను జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో నిర్వహించాలని తొలుత అనుకొన్నారు. కానీ సాయంత్రం కుటుంబ సభ్యులు నిర్ణయం మేరకు మోయినాబాద్లోని కనకమామిడి ఫామ్హౌస్లో అంత్యక్రియలు నిర్వహించాలని తీర్మానించారు. సోమవారం అంటే.. సెప్టెంబర్ 12వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు కృష్ణం రాజు అంత్యక్రియలను అక్కడే కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. అంత్యక్రియల నిర్వహణ సమయంలో మీడియా కవరేజిపై ఆంక్షలు విధించారు.


Click it and Unblock the Notifications











