రెండు భాషల్లో ఒకేసారి 'కృష్ణం వందే జగద్గురుమ్'
దగ్గుబాటి రానా హీరోగా, క్రిష్ దర్శకత్వంలో, సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'కృష్ణం వందే జగద్గురుమ్'. మార్కెట్ని విస్తృతం చేసుకొనే క్రమంలో తెలుగు దర్శకులు, హీరోలు తమ చిత్రాల్ని రెండు భాషలకు అనుగుణంగా మలచుకొంటున్నారు. ఈ చిత్రం తమిళంలోనూ రిలీజ్ చెయ్యాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు మీడియాకు తెలియచేసారు. ఇటీవలే పొల్లాచ్చిలో విజయన్ ఆధ్వర్యంలో పోరాట సన్నివేశాల్ని చిత్రించారు. ప్రస్తుతం చెన్నై పరిసరాల్లో షూటింగ్ సాగుతోంది.
ఈ విషయమై దర్శకుడు మాట్లాడుతూ ''సురభి కళాకారుడైన బీటెక్ బాబు జీవితం చుట్టూ అల్లుకున్న కథ ఇది. నాటకాలు వేసే బాబుకి ఉన్న సామాజిక స్పృహ ఎలాంటిది? దేవిక అనే డాక్యుమెంటరీ రూపకర్తతో పరిచయమయ్యాక ఏం చేశాడు? అనేది తెరపైనే చూడాలి. రెండు భాషల్లోనూ ఒకేసారి విడుదల చేస్తాము''అన్నారు. బళ్లారి బేస్ గా కథనం నడుస్తుందని చెప్తున్నారు. గాలి జనార్ధన రెడ్డి పాత్రను బేస్ చేసుకుని ఆ పాత్రను రూపొందించినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
హీరో రానా మాట్లాడుతూ..."ఇది నాకు ఆరో సినిమా. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు ఒక ఎత్తయితే ఈ సినిమా ఒక ఎత్తు. ఇందులో నా కోసమే ప్రత్యేకంగా తీర్చిదిద్దిన పాత్రను చేస్తుండటం చాలా ఆనందంగా వుందని అన్నారు. 'గమ్యం', 'వేదం'.. ఇవి రెండూ జీవితాల్లోంచి పుట్టిన కథలు. ఇది కూడా అలాంటిదే. అయినా వాణిజ్య అంశాలకు కొదవ ఉండదు'' అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో హీరోపై కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా రానా సరసన చేస్తోంది. నయనతార పాత్ర పేరు దేవిక. ఆమె డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. ఈ పాత్ర చిత్రంలో కీలకమై నడుస్తుంది. ఈ విషయం దర్శకుడు క్రిష్ చెపుతూ...''నా సినిమాల్లో హీరోయిన్ పాత్రకూ ప్రాముఖ్యం ఉంటుంది. 'గమ్యం'లో జానకి, 'వేదం'లో సరోజ పాత్రలు కథను ముందుండి నడిపించాయి. ఈ సినిమాలోనూ అలాంటి పాత్రే ఉంది. నయనతార దేవికగా కనిపిస్తుంది. బీటెక్ బాబు మాస్ అయితే దేవిక క్లాస్. డాక్యుమెంటరీలు తీస్తుంటుంది. వీరిద్దరి సంబంధం ఏమిటో తెరపై చూస్తేనే బాగుంటుంది''అన్నారు.


Click it and Unblock the Notifications











