పాపం కులశేఖర్.. మరోసారి జైలుకు.. జీవితం దుర్భరం కావడానికి కారణం ఎవరంటే?
సినీ గేయ రచయిత కులశేఖర్ జీవితం మరోసారి మీడియాలో చర్చనీయాంశమైంది. 2000లో అద్భుతమైన పాటలతో ప్రేక్షకులను ఊర్రూతలూగించిన ఆయన అనూహ్యంగా ప్రతిష్టను కోల్పోయి పాతాళంలోకి కూరుకుపోయాడు. తాజాగా దొంగతనం కేసులో అరెస్టై మరోసారి వార్తల్లో నిలిచాడు. చిత్రం, నువ్వు నేను, మనసంత నువ్వే చిత్రాలకు అద్భుతమైన బాణీలు కట్టిన కులశేఖర్ పరిస్థితి ఎలా దారుణంగా మారిందనే ఆవేదన అభిమానుల్లో వినిపిస్తున్నది. వివరాల్లోకి వెళితే..

కులశేఖర్ దొంగతనానికి పాల్పడుతూ
కులశేఖర్ను తాజాగా హైదరాబాద్ అమీర్పేటలోని ఆర్బీఐ స్టాఫ్ క్వార్టర్స్లోని దేవీ ఆలయంలో విలువైన వస్తువులను దొంగిలిస్తూ పట్టుబడ్డటం మరోసారి సంచలనం రేపింది. దేవుడి నగలు ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించారని ఆలయ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విలువైన వస్తువుల స్వాధీనం
కులశేఖర్పై ఆలయ నిర్వాహకుల ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు శ్రీనగర్ కాలనీలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆయనను అరెస్ట్ చేశారు. ఆయన వద్ద నుంచి రూ.50 వేల విలువైన 10 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకా ఆయన బ్యాగ్లో రూ.45 వేల విలువైన వస్తువులు, కొన్ని తాళాలు, డెబిట్, క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకొన్నారు.

గతంలో కాకినాడలో కూడా
గతంలో 2013లో కాకినాడలో దొంగతనానికి పాల్పడుతూ తొలిసారి పోలీసులకు చిక్కడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. గుడిలో శఠగోపం దొంగిలిస్తూ పట్టుబడ్డారు. దాంతో ఈ పని చేసింది కులశేఖరేనా అని ముక్కున వేలేసుకొన్నారు. ఈ కేసులో కులశేఖర్ జైలుకు వెళ్లిన తర్వాత కుటుంబ సభ్యులు అతడిని దూరంగా పెట్టారు.

కులశేఖర్ దీన పరిస్థితి కారణమేమిటంటే
కులశేఖర్ పరిస్థితి దీనంగా తయారు కావడానికి ఓ సినిమాకు రాసిన పాటనే అని చెప్పుకొంటారు. ఓ కులానికి సంబంధించిన వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా పాట రాయడంతో ఆ వర్గం వారు కులశేఖర్కు అవకాశాలు లేకుండా చేశారంటారు. దాంతో ఆయన మానసిక రుగ్మతకు లోనై మతిస్థిమితం కోల్పోయి దొంగతనాలకు పాల్పడుతున్నట్టు, ఆ వర్గం వారిని దెబ్బ తీయడానికి దొంగగా మారారని ఆయన సన్నిహితులు చెప్పుకొంటారు. ఏదిఏమైనా విధి వంచించిన కులశేఖర్ జీవితాన్ని చూస్తే ప్రతీ ఒక్కరు బాధపడే పరిస్థితి కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











