కొడాలి నానికి కుమారి ఆంటి షాక్.. మహర్షి సినిమాలో మహేశ్ బాబు లాంటి ఆ వ్యక్తికి ఓటేయ్యండి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక నియోజకవర్గాలుగా కొన్ని సెగ్మెంట్లను పరిగణిస్తున్నారు. అగ్రనేతలు పోటీ చేయడమే అందుకు కారణం. కుప్పం, పులివెందుల, మంగళగిరి, హిందూపురం, నగరి, పిఠాపురం వీటిలో ప్రధానమైనవి. అలాగే అందరి దృష్టి నెలకొన్న మరో స్థానం గుడివాడ. ఈ నియోజకవర్గాన్ని అడ్డాగా చేసుకుని రాజకీయాలు చేస్తున్నారు కొడాలి నాని. తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన టీడీపీకి కొరకరాని కొయ్యగా మారారు. గుడివాడలో ఈసారి నానిని ఎలాగైనా ఓడించాలని తెలుగు తమ్ముళ్లు కసితో ఉన్నారు.
అన్ని లెక్కలు, సామాజిక సమీకరణాలు, సర్వేల ఆధారంగా గుడివాడలో కొడాలి నానిపై ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాముని బరిలో దించింది టీడీపీ. సౌమ్యుడు, మృదుస్వభావిగా పేరున్న రాము.. నానిని ఢీకొట్టగలరా అన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది. రాము విజయమే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు రేయింబవళ్లు కష్టపడుతున్నాయి. టీడీపీ అగ్రనేతలు గుడివాడలోనే మకాం వేసి ప్రచారం, ఇతర పనుల్ని పర్యవేక్షిస్తున్నారు.

ఈ నేపథ్యంలో గుడివాడలో వెనిగండ్ల రాము తరపున ప్రచారం కోసం ఓ వ్యక్తి వచ్చారు. ఆమె ఎవరో కాదు.. లేటెస్ట్ సెన్షేషన్ కుమారి ఆంటీ. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కువగా వుండే ఏరియాలో చిన్న బండిపై భోజనం విక్రయించి జీవించే కుమారి ఆంటీ .. సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రెటీగా మారింది. హైదరాబాద్లో ఆక్రమణల తొలగింపు సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులతో వివాదం, అది కాస్తా సీఎం రేవంత్ రెడ్డి వరకు వెళ్లడం, ఆయన జోక్యం చేసుకుని సాయొం చేయడంతో రెండు రాష్ట్రాల్లోనూ కుమారి ఆంటీ క్రేజ్ తారాస్థాయికి చేరింది. మూవీ ప్రమోషన్లు, సెలబ్రెటీ షోలు, ఈవెంట్లు, ఇంటర్వ్యూలతో కుమారి ఆంటీ స్టేటస్ మారిపోయింది. ఆ క్రేజ్ను క్యాష్ చేసుకోవాలని అనుకున్నారేమో గానీ.. కుమారి ఆంటీని గుడివాడలో ప్రచారంలో దించారు .

నిజానికి గుడివాడ ఆమె స్వస్థలం. ఇక్కడి పరిస్ధితులు, రాజకీయాలు, సమస్యలు కుమారి ఆంటీకి కొట్టిన పిండి. ఆమెకున్న పాపులారిటీతో పాటు ఈ అంశాలు కూడా ఆంటీని గుడివాడకు తీసుకొచ్చాయి. ఈ సెగ్మెంట్ నుంచి బరిలో దిగిన కూటమి అభ్యర్ధి వెనిగండ్ల రాము తరపున ఆమె ప్రచారం చేశారు. పట్టణంలోని 21, 24, 25, 31, 32 వార్డుల్లో కుమారి ఆంటీ క్యాంపెయినింగ్ నిర్వించారు. ఈ సందర్భంగా రాముపై ఆమె ప్రశంసల వర్షం కురిపించారు. మహర్షి సినిమాలో మహశ్ బాబులా రాము మంచి మనసున్న వ్యక్తన్నారు. ఆ సినిమాలో మహేశ్ బాబు ప్రజల కోసం సేవ చేస్తే.. గుడివాడలో రియల్గా వెనిగండ్ల రాము సేవ చేస్తున్నారని కుమారి అంటీ చెప్పింది.
15 ఏళ్ల కిందట గుడివాడ అభివృద్ధి లేకుండా ఎలా వుందో ఇప్పటికీ అలాగే వుందన్నారు. వెనిగండ్ల రాము గెలిస్తే గుడివాడ డెవలప్మెంట్ జరుగుతుందని.. ఇక్కడ సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్లే తనలాంటి వారు పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోందని కుమారి ఆంటి ఆవేదన వ్యక్తం చేసింది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో గుడివాడలో వెనిగండ్ల రాముని.. మచిలీపట్నంలో ఎంపీ అభ్యర్ధిగా వున్న వల్లభనేని బాలశౌరిని గెలిపించాలని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.


Click it and Unblock the Notifications











