ఎన్టీఆర్ బయోపిక్లో నన్ను చూపించే సాహసం చేయరు.. వర్మతో అగ్రిమెంట్.. లక్ష్మి పార్వతి!
నందమూరి తారక రామారావు సతీమణి లక్ష్మి పార్వతి కేంద్రంగా ఎన్టీఆర్ బయోపిక్ గురించి చర్చ జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ స్వయంగా ఎన్టీఆర్ పాత్రలో నటిస్తుండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. వాస్తవాలు చూపించకుండా బయోపిక్ చేస్తే ప్రయోజనం ఏముంటుందని లక్ష్మి పార్వతి ఇప్పటికే ఎన్టీఆర్ చిత్రంపై విమర్శలు గుప్పించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో లక్ష్మి పార్వతి మాట్లాడుతూ ఎన్టీఆర్ బయోపిక్ లో తనని చూపించే సాహసం చేయరు అంటూ వ్యాఖ్యానించారు.

రాజకీయ నేపథ్యంలో
ఎన్టీఆర్ బిపిక్ చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహా నాయకుడిగా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాల్లో ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తరువాత లక్ష్మి పార్వతిని వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పాత్ర కూడా ఈ చిత్రంలో ఉంటుందా అనే చర్చ జరుగుతోంది. దీనిపై లక్ష్మి పార్వతి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నన్ను చూపించే సాహసం
ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నన్ను చూపించే సాహసం చేస్తారని నేను అనుకోవడం లేదు. నా పాత్ర పెట్టాలంటే వాస్తవాలు చూపించాలి. కాబట్టి ఎన్టీఆర్ బయోపిక్ లో తన పాత్ర ఉంటుందని తాను అనుకోవడం లేదని లక్ష్మి పార్వతి అన్నారు. నాదెండ్ల భాస్కర రావు ఎపిసోడ్ తో ఎన్టీఆర్ బయోపిక్ ని ముగిస్తారని లక్ష్మి పార్వతి అన్నారు.

వర్మతో అగ్రిమెంట్
ఇక వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో తెరకెక్కించేందుకు సిద్ధం అవుతున్నారు. వర్మ వాస్తవాలు తెరకెక్కిస్తాడని మీరు నమ్ముతున్నారా అనే ప్రశ్నకు లక్ష్మి పార్వతి సమాధానం ఇచ్చారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం నా పేరుతో తెరకెక్కుతోన్న చిత్రం. కాబట్టి నా అనుమతి తప్పనిసరిగా ఉండాలి. ఆ విషయంలో వర్మతో అగ్రిమెంట్ జరిగిందని లక్ష్మి పార్వతి అన్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని లక్ష్మి పార్వతి అన్నారు.

లక్ష్మి పార్వతిగా ఎవరు
వర్మ తెరకెక్కించబోతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో తన పాత్రలో ఎవరు నటిస్తారో తనకు తెలియదని లక్ష్మి పార్వతి అన్నారు. ఎవరు నటిస్తే బావుంటుందో కూడా తాను చెప్పలేనని.. ఎందుకంటే తనకు సినిమా పరిజ్ఞానం లేదని లక్ష్మి పార్వతి తెలిపారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన సన్నివేశాలు కూడా ఉంటాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ని వాళ్ళ అమ్మతో కలసి ఎన్టీఆర్ వద్దకు పిలిపించింది తానే అని లక్ష్మి పార్వతి తెలిపారు.


Click it and Unblock the Notifications











