‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్ అవుతోంది... ఏపీలో ఆపడంపై సుప్రీం కోర్టుకు చిత్ర బృందం!
'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం నేడు (మార్చి 29) విడుదలకు సిద్ధమైంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా విడుదలపై హై కోర్టు స్టే విధించడంతో అక్కడ మాత్రమే రిలీజ్ ఆగిపోయింది. కోర్టు తీర్పు నేపథ్యంలో సినిమా ఇతర ప్రాంతాల్లో రిలీజ్ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని, తెలంగాణతో పాటు అన్ని ఏరియాల్లో సినిమా విడుదలవుతుందని చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు.
'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాపై గురువారం ఏపీ హైకోర్టులో వాదనలు జరిగాయి. అనంతరం కోర్టు స్పందిస్తూ ఏప్రిల్ 3వ తేదీ వరకు ఈ సినిమాను ప్రదర్శించవద్దని హైకోర్టు చిత్ర బృందాన్ని ఆదేశించింది. సినిమా చూసిన తర్వాత తుది తీర్పు వెల్లడిస్తామని న్యాయమూర్తి వెల్లడించారు.
సుప్రీం కోర్టుకు చిత్ర బృందం
సెన్సార్బోర్డు నుంచి అనుమతి లభించిన తర్వాత సినిమాను ఎవరూ అడ్డుకోవడానికి వీల్లేదని ‘లక్ష్మీ ఎన్టీఆర్' నిర్మాత తరుపున న్యాయవాది వాదించారు. గతంలో ‘పద్మావత్' సినిమా విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను గుర్తుచేయడంతో పాటు, తెలంగాణ హైకోర్ట్ ఈ చిత్రానికి అనుమతి ఇచ్చిన విషయాలను న్యాయవాది ప్రస్తావించారు. అయినప్పటికీ కోర్టు స్టే విధించింది. దీనిపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నట్లు వర్మ ప్రకటించారు. శుక్రవారం ఉదయం మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు తెలియజేస్తానని ట్వీట్ తెలిపారు.
మరోసారి ఎన్టీఆర్కు వెన్నుపోటు
‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదల ఆపడం ద్వారా ఏపీలో కొందరు మరోసారి ఎన్టీ రామారావును వెన్నపోటు పొడిచారని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. గతంలో ఎన్టీఆర్ మరణించడానికి ముందు సింహగర్జన మీటింగుకు ఎన్టీ రామారావు రాకుండా అడ్డుకున్నాడు. ఆ వ్యక్తి వెన్నుపోటు పొడవటంలో ఎక్స్పర్ట్ అని నా అభిప్రాయం... మీరేమంటారు? అంటూ వర్మ ట్వీట్ చేశారు.
ప్రజలను విడగొట్టిన ఘనత దురదృష్టవశాత్తు లక్ష్మీస్ ఎన్టీఆర్కి దక్కింది
ప్రప్రధమంగా తెలుగు ప్రజలను విడగొట్టిన ఘనత దురదృష్టవశాత్తు, లక్ష్మీస్ ఎన్టీఆర్కి దక్కింది. కోర్ట్ ఆర్డర్ కారణంగా ఆంధ్రప్రదేశ్లో తప్ప తెలంగాణలోనూ ఇంకా ప్రపంచంలో ఉన్న తెలుగువాళ్లందరూ సినిమా చూడొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడలేరు. హత విధి!!! అంటూ వర్మ పేర్కొన్నారు.
ఆ వెన్నుపోటుదారుడెవరో?
తెలుగు వాడి ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టిన అతి గొప్ప తెలుగువాడి మరణానికి దారి తీసిన మానసిక క్షోభ రేపు తెలుగు వాళ్ళల్లో కొంత మందే చూస్తుంటే ఇంకా ఎందరో కేవలం ఎదురు చూసే పరిస్థితి కల్పించిన ఆ వెన్నుపోటుదారుడెవరో? అంటూ వర్మ ట్వీట్ చేశారు.
ఈ ఎన్నికలలో ఓటమి ప్రాప్తించుగాక
సినిమా కోసం పుట్టి, సినిమా మూలంగా సీఎం అయిన మహానాయకుడు ఎలా సీఎం పదవి పోగొట్టుకున్నాడో అనే సినిమా చూడకుండా ఆపుతున్న తెర వెనక ఉన్న వెన్నుపోటు డైరెక్టర్కి నాలాంటి కోట్ల ఎన్టీఆర్ అభిమానులందరం కమండలంలో నీళ్లు తీసి శపిస్తున్నాం.. ఈ ఎన్నికలలో ఓటమి ప్రాప్తించుగాక .. తధాస్తు... అంటూ వర్మ మరో ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











