రాజ్ తరుణ్కు ఎన్నేళ్ల శిక్ష అంటే? కేసు రుజువైతే అంటూ లాయర్ చెప్పిన షాకింగ్ విషయాలు!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు హీరో రాజ్ తరుణ్ వ్యవహారం పెద్ద చర్చనీయాంశమైంది. తనతో 11 ఏళ్లు రిలేషన్లో ఉండి.. మరో అమ్మాయి మోజులో పడి ఇప్పుడు తనను దూరం పెడుతున్నాడని లావణ్య అనే యువతి హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తాను గర్భం దాల్చడంతో రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించిన మెడికల్ రిపోర్టులు, 170 ఫోటోలను ఆమె పోలీసులకు అందజేశారు. రాజ్ తరుణ్తో రిలేషన్లో ఉన్న హీరోయిన్ మాల్వీ మల్హోత్రా, ఆమె తమ్ముడు తనను బెదిరిస్తున్నారని ఆరోపించింది.
లావణ్య ఆరోపణలు, ఆమె సమర్పించిన ప్రాథమిక సాక్ష్యాల ఆధారంగా రాజ్తరుణ్పై 420, 493, 506 కింద కేసు నమోదైందని న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర చెప్పారు. ఈ పరిణామాలు చూస్తుంటే.. కేసు బలంగానే ఉందని, రాజ్ తరుణ్ చుట్టూ ఉచ్చు బిగిసినట్లేనని నిపుణులు అంటున్నారు. తాను చేసిన ఆరోపణలకు తగిన విధంగా సాక్ష్యాలను అందజేయగలిగితే రాజ్ తరుణ్కు శిక్ష పడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ న్యాయవాది సుంకర నరేష్.. రాజ్ తరుణ్ కేసు, నేరం రుజువైతే ఆయనకు పడే శిక్షల గురించి వివరించారు.

సెక్షన్ 493 ప్రకారం.. ఎవరైనా ఒక అబ్బాయి, ఒక అమ్మాయిని మోసం చేసి పెళ్లి కాకుండానే మన ఇద్దరికి పెళ్లయ్యింది, నువ్వు నా భార్యవే అని నమ్మించి ఆమెతో కలిసి లైంగిక చర్యలో పాల్గొంటే .. మోసం చేసినందుకు, లైంగిక చర్యలో పాల్గొన్నందుకు అభియోగాలు మోపుతారని తెలిపారు. దీని కింద పదేళ్ల జైలు శిక్ష పడుతుందని నరేష్ చెప్పారు. సెక్షన్ 420 ప్రకారం మోసం చేసినందుకు 7 ఏళ్లు , సెక్షన్ 506 ప్రకారం.. బెదిరింపులకు పాల్పడినందుకు నేర తీవ్రతను బట్టి ఆరు నెలల నుంచి ఏడాది జైలు శిక్ష పడుతుందని తెలిపారు.
అయితే ఈ కేసులో కొన్ని టెక్నికల్ అంశాలు గందరగోళానికి గురిచేస్తున్నాయని నరేష్ చెప్పారు. రాజ్తరుణ్తో 14 ఏళ్ల క్రితమే పెళ్లి అయ్యిందని , అప్పటి నుంచి మేం కలిసే ఉంటున్నామని లావణ్య ఆరోపిస్తున్నారని తెలిపారు. పెళ్లి అయినప్పుడు , భార్యాభర్తలిద్దరూ కలిసి కాపురం చేయొచ్చని.. అలాంటప్పుడు 493 సెక్షన్ ఎలా వర్తిస్తుందని లాయర్ నరేష్ ప్రశ్నించారు. అంటే పెళ్లి అబద్ధమా లేక పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక చర్యలో పాల్గొనడం అబద్ధమా అని ఆయన వ్యాఖ్యానించారు. దీనిని బట్టి లావణ్య చేసిన ఫిర్యాదులోనే క్లారిటీ లేదన్నారు.
అబార్షన్ వ్యవహారానికి వస్తే.. దీనికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించానని లావణ్య అంటున్నారని నరేష్ తెలిపారు. అలాంటప్పుడు ఐపీసీ సెక్షన్ 314 ప్రకారం పదేళ్ల జైలు శిక్ష పడుతుందని, మరి ఎఫ్ఐఆర్లో ఆ సెక్షన్ కింద కేసు ఎందుకు నమోదు చేయలేదని ఆయన ప్రశ్నించారు. అంటే అబార్షన్ జరగలేదా.. ఒకవేళ జరిగినా లావణ్య తనకు తాను స్వచ్ఛందంగా చేయించుకున్నారా , రాజ్తరుణ్ బలవంతంగా చేయించి ఉంటే అప్పుడే కంప్లయంట్ ఎందుకు ఇవ్వలేదు.. ఒకవేళ ఇచ్చినా పోలీసులు 314 కింద కేసు నమోదు చేయలేదా అని లాయర్ నరేష్ ప్రశ్నించారు.
అయితే ఇంత జరుగుతున్నా, కేసులు నమోదైనా రాజ్తరుణ్ని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదన్న ప్రశ్నకు లాయర్ నరేష్ స్పందించారు. సెక్షన్ 493 కింద కేసు నమోదైనప్పుడు రాజ్తరుణ్ని అరెస్ట్ చేయాలన్నారు. ఇంకా అది జరగలేదంటే రాజ్ తరుణ్ కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ ఏమైనా తెచ్చుకున్నారా.. లేదంటే న్యాయస్థానం నుంచి ప్రత్యేక ఆదేశాలు తెచ్చుకున్నారా అని నరేష్ అభిప్రాయపడ్డారు. లేనిపక్షంలో సదరు పోలీస్ అధికారులను ఏమైనా మేనేజ్ చేశారా , లేక ఫిర్యాదుదారు అరెస్ట్ వద్దు మేం మాట్లాడుకుంటాం అని అన్నారా అన్న అంశాలను పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉందన్నారు. అయితే ట్విస్టుల మీద ట్విస్టులతో రాజ్ తరుణ్ కేసు సాగిపోతుండటంతో ఏం జరుగుతుందోనని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











