బాహుబలి: నెక్ట్స్ అన్నపూర్ణ స్టూడియోలో...
హైదరాబాద్: ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'బాహుబలి' చిత్రం త్వరలో నెక్ట్స్ షెడ్యూల్కి రెడీ అవుతోంది. ఈ షెడ్యూల్ కోసం అన్న పూర్ణ స్టూడియోలో భారీ సెట్ వేస్తున్నారు. ఈ సెట్లో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.
తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఎన్నడూ రాని విధంగా కళ్లు చెదిరే గ్రాఫిక్స్, పోరాట సన్నివేశాలతో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 2015లో విడుదల చేయడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని త్వరిత గతిన పూర్తి చేస్తున్నారు. తాజాగా అందుతున్నసమాచారం ప్రకారం రిలీజ్ డేట్ కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 17, 2015లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో రిలీజ్ డేట్ అఫీషియల్గా ప్రకటించే అవకాశం ఉంది.

తాజాగా చిత్రం షూటింగ్ నిలిపి వేసారు. ఇంతకాలం విరామం లేకుండా, అలుపు ఎరుగకుండా పని చేసిన టీం మొత్తం.......కొంతకాలం రెస్ట్ తీసుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ బ్రేక్ ఇచ్చారు. ఈ విషయాన్ని బాహుబలి అఫీషియల్ వెబ్ సైట్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగిన షూటింగును రివ్యూ చేసుకోవడానికి, నెక్ట్స్ షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడానికి ఈ బ్రేక్ బాగా ఉపయోగ పడుతుందని అంటున్నారు.
అయితే దర్శకుడు రాజమౌళి మాత్రం ఈ బ్రేక్లోనూ పని చేస్తున్నారు. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావుతో కలిసి ఎడిటింగును పర్యవేక్షిస్తున్నారు. దీంతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్, పోస్టు ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం అయ్యాయి. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ప్రస్తుతం రెండు సాంగులను రీ రికార్డింగ్ చేస్తున్నారు. తర్వాతి షెడ్యూల్లో హీరోయిన్ తమన్నా షూటింగులో జాయిన్ కాబోతోంది.
దర్శకుడు రాజమౌళి భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ చేయని విధంగా 'బాహుబలి' యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించారు. ప్రధాన తారాగణంతో పాటు దాదాపు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఈ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది.
ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే 'ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు.


Click it and Unblock the Notifications











