లీగల్ నోటీసుల ఎఫెక్ట్ : ఆలోచనలో పడ్డ రాజమౌళి ?
హైదరాబాద్: దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'బాహుబలి'కి లీగల్ సమస్యలు ఎదురైనట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కర్నాటక రాష్ట్రంలోని కర్కాలలో ఉన్న జైన మత మఠం నుంచి దర్శకుడు రాజమౌళికి లీగల్ నోటీసులు జారీ అయినట్లు సమారం. త్యాగానికి, శాంతికి ప్రతిరూపంగా 'బాహుబలి'ని పూజిస్తుంటారు జైనులు.
అలాంటి గొప్ప వ్యక్తి అయిన 'బాహుబలి' పేరును.........రాజమౌళి తను రూపొందిస్తున్న హింసాత్మక చిత్రానికి టైటిల్గా పెట్టడంపై జైనులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే టైటిల్ మార్చాలని వారు లీగల్ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
లీగల్ నోటీసులు అందడంతో దర్శకుడు రాజమౌళి ఆలోచనలో పడ్డారు. మరి రాజమౌళి ఈ లీగల్ నోటీసులపై ఎలా స్పందిస్తారు? సినిమా టైటిల్ మారుస్తారా? వారికి నచ్చిచెప్పి ఒప్పించే ప్రయత్నం చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ మధ్య ఇలాంటి కాంట్రవర్సీలు కామన్ అయ్యాయి. పైగా ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెడుతున్నాయి.
ప్రభాస్, అనుష్క, రాణా, తమన్నా ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'బాహుబలి'. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో భారీ యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.
దర్శకుడు రాజమౌళి భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ చేయని విధంగా 'బాహుబలి' యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రధాన తారాగణంతో పాటు దాదాపు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఈ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించేందుకు ప్లాన్ చేసారు.
భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే 'ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు 2015లో వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications












