తెలుగు చిత్రాలకు నిరాశే, ఆస్కార్ బరిలో ‘లయర్స్ డైస్’
హైదరాబాద్: సినిమా రంగంలో ప్రపంచ స్థాయి అవార్డులైన ‘ఆస్కార్ అవార్డు-2015' వేడుకకు రంగం సిద్ధమైంది. ఈ సారి మన దేశం నుండి ఆస్కార్ అవార్డుల బరిలో ‘లయర్స్ డైస్' అనే హిందీ చిత్రం నిలిచింది. దేశంలోని వివిధ బాషల నుండి దాదాపు 30 సినిమాలు పోటీ పడగా....12 మంది సభ్యులతో కూడిన స్క్రీనింగ్ కమిటీ ‘లయర్స్ డైస్' చిత్రాన్ని ఎంపిక చేసింది. ఈ చిత్రం ఇటీవలే జాతీయ అవార్డు కూడా వచ్చింది.

లయర్స్ డైస్ చిత్రాన్ని భారతదేశం తరుపున విదేశీ చిత్రాల కేటగిరీ అవార్డు కోసం పంపుతున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి సుప్రాణ్ సేన్ తెలిపారు. లయర్స్ డైస్ చిత్రం మళయాల నటి గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా. గీతాంజలి థాపా, నవాజుద్దీన్ సిద్ధికీ ముఖ్య పాత్రల్లో నటించారు. తన మూడేళ్ల కూతురుతో కలిసి తప్పిపోయిన భర్త కోసం వెతికే మహిళ కథే ఈ చిత్రం.
తెలుగు చిత్రాలకు నిరాశే..
ఆస్కార్ బరిలో నిలిచేందుకు తెలుగు నుండి పోటీ పడ్డ ‘మనం', ‘మినుగురులు' చిత్రాలకు నిరాశే ఎదురైంది. బెంగాళీ చిత్రం జతీశ్వర్, మరాఠీ చిత్రం ఫండ్రీ, దర్శకుడు హన్సల్ మెహతా హిందీ చిత్రం షాహిద్లు స్క్రీనింగ్ కమిటీ ముందుకు వచ్చాయి. అలాగే మర్ధానీ, ఫిల్మీస్దాన్, సంజయ్ లీలా భన్సాలీ రామ్ లీలా, మేరీ కోమ్ కూడా ఉన్నాయి. ఇక తమిళం నుంచి కొచ్చడయనా, కదై తిరక్కదై వసనమ్ ఇయక్కమ్ చిత్రాలు కూడా ఉన్నాయి. వీటితో పాటు కొన్ని కొంకణీ చిత్రాలు కూడా రేసులో నిలిచినాయి.


Click it and Unblock the Notifications











