‘ఆరక్షణ్’ విడుదలకు ఏపీలో లైన్ క్లియర్
ఆరక్షణ్ సినిమాలో ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు, వ్యాఖ్యలు లేవని....ఆ సినిమాపై ఆంధ్రప్రదేశ్ లో విధించిన నిషేదాన్ని ఎత్తి వేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు కాంగ్రెస్ దళిత నేత మల్లు రవి శనివారం తెలిపారు. సినిమాను తామంతా చూశామని, కొంత మంది ఆందోళన చేస్తున్నట్లుగా అందులో ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు. నిర్మాత సునీల్ సినిమాను తెలుగు ప్రజలకు అర్థం అయ్యేలా అనువదించి విడుదల చేస్తారని తెలిపారు. సినిమాపై వేసిన కమిటీ లైన్ క్లియర్ చేయడంతో ఆరక్షణ్ విడుదలపై ఆంధ్రప్రదేశ్లో నిషేధం తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి.
బిగ్ బి అమితాబ్, సైఫ్ అలీఖాన్, దీపికా పడుకొనె ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రకాష్ ఝా 'ఆరక్షణ్" సినిమా రూపొందించిన విషయం తెలిసిందే. సినిమాకు ముందు విడుదలైన ట్రయిలర్ లో....భారతీయ విద్యా వ్యవస్థలో కుల పరమైన రిజర్వేషన్ లను విమర్శిస్తున్నట్లు సన్నివేశాలు కనిపించడంతో కొన్ని దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ మేరకు ఉత్తరప్రదేశ్, పంజాబ్ తో పాటు ఆంధ్రప్రదేశ్ లోనూ ఈ సినిమా విడుదలపై నిషేదం విధించారు.
సినిమాలో ఏముందనే విషయాన్ని గమనించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మల్లు రవి నేతృత్వంలో కమిటీని నియమించింది. ఈ మేరకు సినిమాను చూసిన కమిటీ అందులో ఎలాంటి అభ్యంతరాలు లేవని, నిషేదం ఎత్తి వేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది.


Click it and Unblock the Notifications











