విడాకులు: 80 కోట్లు డిమాండ్ చేస్తున్న దర్శకుడి భార్య
హైదరాబాద్: సౌతిండియాతో పాటు బాలీవుడ్లోనూ పలు విజయవంతమైన సినిమాలు తీసి టాప్ డైరెక్టర్ ప్రియదర్శన్, ఆయన భార్య లిజి విడాకుల కోసం చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించి తమ 24 ఏళ్ల వైవాహిక జీవితాన్ తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా భర్త నుండి భరణం కింద లిజి రూ. 80 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
1996లో ప్రేమ వివాహం చేసుకున్న లిజి, ప్రియదర్శన్కు కల్యాణి, సిద్ధార్థ్ అనే పిల్లలున్నారు, వారిద్దరూ విదేశాల్లో చదువుకుంటున్నారు. విడాకుల విషయమై లిజి స్పందిస్తూ తాము విడిపోతున్నట్లు పిల్లలు, సన్నిహితులకు చాలా రోజుల ముందే తెలుసని, తమ జీవితంలో ఇది అత్యంత క్లిష్ట సమయమని పేర్కొన్నారు. దయచేసి తమ ప్రైవసీకి భంగం కలిగించొద్దని లిజి మీడియాకు విన్నవించారు. ఇద్దరి అంగీకారం ఉండటంతో త్వరలోనే విడాకులు మంజూరయ్యే అవకాశం ఉంది.

ప్రియదర్శన సినిమాల విషయానికొస్తే...కేరళలో జన్మించిన ప్రియదర్శన్ మళయాల దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి తెలుగు, తమిళం, హిందీల్లో పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో నాగార్జున హీరోగా వచ్చిన ‘నిర్ణయం', బాలయ్య-నాగేశ్వరరావు కాంబినేషన్లో వచ్చిన ‘గాండీవం' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. హిందీలో దాదాపు 25 చిత్రాలకు దర్శకత్వం వహించారు.
లిజి విషయానికొస్తే....మళయాల హీరోయిన్గా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించారు. మగాడు, సాక్షి, దోసి నిర్దోషి, ఇరవయ్యవ శతాబ్దం, మామాశ్రీ, ఆత్మబంధం, శివశక్తి లాంటి చిత్రాల్లో నటించారు. ప్రియదర్శన్తో 1996లో వివాహం తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నారు.


Click it and Unblock the Notifications











