కాజోల్ గాజులు చోరి..దొంగలు దొరికారు
ముంబయి: బాలీవుడ్ నటులు అజయ్ దేవగణ్, కాజోల్ దంపతులకు చెందిన జుహూ బంగ్లాలో బంగారు గాజులు చోరీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ గాజులను చోరీ చేసిన కేసులో ఇద్దరు నౌకర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె నివాసంలో పని చేసిన గాయత్రి దేవేంద్ర, సంతోష్ పాండేలు ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. గత రెండు, మూడేళ్లుగా గాయత్రి దేవేంద్ర, సంతోష్ పాండే అనే నౌకరులిద్దరు దేవగణ్ బంగ్లా వెలుపల శుభ్రం చేసే పనులు చేస్తున్నారు. కర్వాచౌత్ పర్వదినం సందర్భంగా ఇంటిని శుభ్రం చేసే పనిని వీరికి అప్పగించగా దొంగతనానికి పాల్పడ్డారు. ఈ నెల 19న బంగారు గాజులను అపహరించగా మూడు రోజుల తర్వాత కాజోల్ ఈ విషయాన్ని గ్రహించారు.
22న కర్వాచౌత్ పండుగ నాడు బంగారు గాజులు కన్పించకపోవడంతో కాజోల్ జుహూ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సుమారు అయిదు లక్షల విలువైన 17 గాజులు కన్పించకుండా పోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బీరువాలోని ఆభరణాల పెట్టెలో నుంచి ఈ గాజులను అపహరించినట్లు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తులో భాగంగా నౌకర్లు, ఇతర అనుమానితులను విచారించారు. కొందరు వ్యక్తులకి పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించగా గాయత్రి నేరం అంగీకరించింది.
ఆమె వెల్లడించిన వివరాల మేరకు నాలాసోపరాకు చెందిన పాండేను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి పోలీసులు నాలుగు గాజులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మిగితా గాజులను కరిగించి వేశారు. దేవగణ్ నివాసంలో దొంగతనం జరగడం ఇది రెండోసారి. 2008లో జరిగిన దొంగతనానికి సంబంధించి ఛత్తీస్గఢ్లో ఒక నౌకరును అరెస్టు చేశారు. ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు పోలీసు కమిషనర్ (పడమర) విశ్వాస్ నంగ్రే పాటిల్ తెలిపారు.


Click it and Unblock the Notifications












