బ్రేకింగ్: సిరివెన్నెల సీతారామరాశాస్త్రి కన్నుమూత.. తీవ్ర విషాదంలో టాలీవుడ్
తెలుగు సినిమా పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తెలుగు పాట మూగబోయింది. తెలుగు సినిమాకు ఆణిముత్యంగా, సినీ సాహిత్యానికి కేరాఫ్ అడ్రస్గా మారిన సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇకలేరు. న్యూమోనియా వ్యాధితో బాధపడుతున్న ఆయన కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారని కిమ్స్ వైద్యులు అధికారికంగా ప్రకటించారు. దీంతో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ విషాద వార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు కన్నీరుమున్నీరవుతున్నారు. సిరివెన్నెల మరణానికి సంబంధించి వివరాల్లోకి వెళితే..

న్యూమోనియా వ్యాధితో కిమ్స్లో చేరిక
సిరివెన్నెల సీతారామశాస్త్రి కొద్ది రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. న్యుమోనియా వ్యాధితో బాధపడుతున్న ఆయనను హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. కొద్ది రోజులుగా ఆయనకు వైద్య నిపుణులు చికిత్సను అందిస్తున్నారు. అయితే ఊహించని రీతిలో ఆయన ఈ లోకం నుంచి నిష్రమించారు. దీంతో సంగీత, సాహిత్య ప్రపంచం మూగపోయింది.

ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ లక్షణాలు అంటూ కిమ్స్ వైద్యులు
సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణాన్ని కిమ్స్ వైద్యులు ధృవీకరించారు. 24వ తేదీన ఆయన న్యూమోనియా వ్యాధితో హాస్పిటల్లో చేరారు. అప్పటి నుంచి ఎక్మో సపోర్టుతో ఐసీయూలో చికిత్స అందించాం. ఆయన ఊపిరితిత్తుల క్యాన్సర్ సంబంధింత సమస్యలతో మరణించారు. మంగళవారం మధ్యాహ్నం 4.05 గంటలకు తుదిశ్వాస విడిచారని వైద్యులు ప్రకటించారు.

జననీ జన్మభూమి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ
సిరివెన్నెల సీతారామశాస్త్రి 1984లో బాలకృష్ణ హీరోగా, కే విశ్వనాథ్ దర్వకత్వంలో రూపొందిన జననీ జన్మభూమి సినిమాతో తెలుగు సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆయన సిరివెన్నెల చిత్రంలో విధాత తలపున అనే పాటను రాసి తన ఇంటి పేరును సిరివెన్నెలగా మార్చుకొన్నారు. ఆయన ఇంటి పేరు చెంబోలు, సిరివెన్నెల సినిమా తర్వాత ఆయన సిరివెన్నెల సీతారామశాస్త్రిగా మారిపోయారు.

సిరివెన్నెల సినిమాను ఇంటిపేరుగా
సిరివెన్నెల చిత్రంలో సింగిల్ కార్డు రైటర్గా సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. సిరివెన్నెల సినిమాలో ఆది భిక్షువు అనే పాటను రాసిన ఆయనకు ఉత్తమ గేయ రచయితగా నంది అవార్డుల లభించింది. ఆ తర్వాత శృతిలయలు సినిమాలో తెలవారదేమో స్వామి పాటకు నంది అవార్డును, అలాగే స్వర్ణ కమలం సినిమాకు అందెల రవళి పదములదా అనే పాటకు మరో నంది అవార్డును అందుకొన్నారు. వరుసగా మూడేళ్లు ఉత్తమ గేయ రచయితగా నంది అవార్డు అందుకొన్న ఘనత సిరివెన్నెలకు దక్కింది.
Recommended Video

3000 పైగా పాటలు రాసిన సినీ కవి
తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు సిరివెన్నెల సీతారామశాస్త్రి 3000 పైగా పాటలు రాశారు. తెలుగు సినిమా పరిశ్రమకు ఎనలేని సేవలు చేసినందుకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం 2019లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. తెలుగు సినిమా సాహిత్యానికి గుర్తింపు తెచ్చిన ఆయన శివైక్యం పొందడం తీరని లోటు అంటూ సినీ ప్రముఖులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.


Click it and Unblock the Notifications











