ఆ డబ్బు ముట్టుకోవద్దు: ‘మా’ ప్రమాణ స్వీకారోత్సవంలో శివాజీ రాజా!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో శివాజీ రాజా ప్యానల్ మీద నరేష్ ప్యానల్ గెలుపొందిన సంగతి తెలిసిందే. కొత్తగా ఎన్నికైన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా శివాజీ రాజా మాట్లాడుతూ... కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తాను గతంలో ప్రెసిడెంటుగా ఎన్నికైన సమయంలో సుమ అసోసియేషన్ కోసం రూ. 2 లక్షలు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.

కొత్త కమిటీ అద్భుతాలు చేయాలి
కొత్తగా ఎన్నికైన ‘మా' కమిటీ అద్భుతాలు చేయాలని, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని, ఎప్పటిలానే మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు శివాజీ రాజా తెలిపారు.

పైసా ముట్టుకోవద్దు
నాకంటే ముందు ఉన్న ప్రెసిడెంట్స్ నాకు ఓ మాట చెప్పారు. ‘‘మేము ఎక్కడెక్కడి నుంచే కష్టపడి ఫండ్ కలెక్ట్ చేశాం. దాంట్లో నుంచి పైసా కూడా కదపకుండా మీరు కష్టపడి దాంట్లో నుంచి అసోసియేషన్, లేని వారిని బాగా చూసుకోండి'' అని చెప్పారు. దాన్ని నేను తూచా తప్పకుండా పాటించాను. రాబోయే కమిటీకి ఇదే చెబుతున్నాను... అని తెలిపారు.

ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధమే
అవసరం అయితే తప్ప ఆ ఫండ్ తీయకుండా, బయటి నుంచి కొత్తగా ఫండ్ తేచ్చే ప్రయత్నాలు చేయాలని కోరుతున్నాను. దానికి నా వంతు సహాయం ఏది కావాలన్నా చేయడానికి సిద్ధమే, అర్దరాత్రి 12 గంటలకు ఫోన్ చేసి ఆసుపత్రికి రమ్మన్నా, ఇంటికి రమ్మన్నా వచ్చి సాయం చేయడానికి తాను ఎప్పుడూ రెడీగా ఉంటానన్నారు.

నరేష్ పేరు పలకని శివాజీ రాజా
తన ప్రసంగంలో శివాజీ రాజా ఎక్కడా కూడా... కొత్త అధ్యక్షుడు నరేష్ పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడలేదు. ‘మా' ఎన్నికల సందర్భంగా, ఎన్నికల తర్వాత కూడా ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











