Don't Miss!
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మెగాస్టార్ ను 'మా' విజేతలు కలిసిన వేళ...(ఫొటోలు)
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు నటకిరీటి రాజేంద్రప్రసాద్ శనివారం సాయంత్రం మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. తన గెలుపుకు కారణమైన మెగా ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
చిరంజీవి మాట్లాడుతూ.... రాజేంద్రప్రసాద్ గెలుపు తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. మా నూతన కార్యవర్గ సభ్యులందరూ సినీ కార్మికులు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ ప్యానల్ సభ్యులను చిరంజీవి సన్మానించారు.
నువ్వా నేనా అన్నట్టు సాగిన 'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల్లో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నటి జయసుధపై ఆయన 85 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. శుక్రవారం హైదరాబాద్లోని చలన చిత్ర వాణిజ్య మండలిలో ఎన్నికల అధికారి వి.కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు జరిగింది. ఏడు రౌండ్లుగా ఓట్లని లెక్కించారు. ప్రతీ రౌండ్లోనూ రాజేంద్రప్రసాద్ ఆధిక్యం ప్రదర్శిస్తూ విజయ దుందుభి మోగించారు.
చిరంజీవిని 'మా' కలిసినప్పటి ఫొటోలు
రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ..
'ప్రపంచంలోని తెలుగవాళ్లందరి ఇళ్లల్లో డీవీడీ రూపంలో ఉన్న నాకు ఆ భగవంతుడు కొత్త బాధ్యతల్ని అందించాడ'ని చెప్పారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్లో సభ్యులు కేవలం 702 మందే అయినా, ఓట్లు వేసింది 394మందే అయినా... ప్రపంచం నలుమూలల ఉన్న తెలుగువాళ్లందరూ రాజేంద్రప్రసాద్కి ఏమైందో అంటూ ఎదురు చూశారనీ, వాళ్లందరికీ ఈ విజయాన్ని అంకితం చేస్తున్నానని రాజేంద్రప్రసాద్ తెలిపారు.
టీ కూడా ఇవ్వొద్దు
అలాగే ...నేను సేవ చేయడానికే వచ్చాను. 'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) నుంచి ఒక్క రూపాయి కూడా పట్టుకెళ్లను. అధ్యక్షుడిగా ఉన్నంత కాలం కార్యాలయంలో టీ కూడా ఇవ్వొద్దని చెబుతున్నా అని అన్నారు.
దండెత్తారు..భయపెట్టారు
ఒక గుడిలోకి వెళ్లి ఒట్టేసుకొని మరీ ఎన్నికల బరిలోకి దిగానన్నా వినలేదు. పాండవుల్లాగా ఐదుగురం ఉన్న మాపై కౌరవుల్లాగా దండెత్తారు. భయపెట్టారు, ప్రలోభపెట్టారు, దబాయించారు. నా మీద వీలైనన్ని అపవాదులు వేశారు. నా చుట్టూ వున్నవాళ్లని భయపెట్టి పారిపోయేట్టు చేశారు. నేను వాటన్నిటినీ ఎదుర్కొని ఒంటరిగా పోరాటం చేశా.
కోరిక లేదు..లక్ష్యం ఉంది
నాకు దండలు వేయించుకోవాలనే కోరిక లేదు. 37 ఏళ్ల కాలంలో 230 సినిమాలు చేసి... నటుడిగా చాలాసార్లు దండలు వేయించుకొన్నా. అవన్నీ ప్రేక్షకులకు నన్ను దగ్గర చేశాయి. సేవ చేయడమే లక్ష్యంగా 'మా' ఎన్నికల్లో పోటీ చేశా.
ఏకైక వ్యక్తి నాగబాబు
అడుగడుగునా నా వెన్ను తట్టి నిలిచిన ఏకైక వ్యక్తి నాగబాబు. ఆ సోదరులు ఇంటికి పిలిచి పండగ రోజున ప్రసాదం పెట్టి 'రాజా నువ్వు మంచి చేయదలచుకొన్నావు. ఎవ్వరి గురించి ఆలోచించద్దు. ముందుకు వెళ్లు' అని భుజం తట్టారు. దాని ఫలితమే ఈ విజయం.
అభిమన్యుడుని కాదు
''అభిమన్యుడిలా ఒంటరిగా దొరికాడనుకొన్నారు. కానీ నేను అర్జునుడిని అన్న విషయం వాళ్లకు తెలియదు. ఎన్నికల్లో కుళ్లు, కుత్సితబుద్ధితో రాజకీయాలు చేశారు. వాటన్నిటినీ దాటుకొని విజయం సాధించాను. ఈ విజయం ఓటేసిన ప్రతి కళాకారుడిదీ, ప్రపంచం నలుమూలల ఉన్న తెలుగువాళ్లందరిదీ'' అన్నారు ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్.
ధన్యవాదాలు
నాపై ఇంతటి ప్రేమని చూపించిన వాళ్ల కోసం నా ప్రాణాల్ని పణంగా పెట్త్టెనా సేవ చేస్తా. పేద కళాకారులకు, కష్టాల్లో ఉన్న కళాకారులకు అండగా నిలుస్తా. నేను ఇచ్చిన ప్రతి మాటనీ నెరవేరుస్తా. సేవ చేసే అవకాశం నాకు కల్పించిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కళాకారులకు నా ధన్యవాదాలు'' అన్నారు.
అన్నగారి స్పూర్తితో..
నిమ్మకూరులో నందమూరి తారకరామారావు ఇంట్లో పుట్టాననీ, వారి ఆశీర్వాదం తీసుకొని ఆయన్ని నమ్మినవాడిగా ఆ స్ఫూర్తిని నింపుకొని ముందుకెళతానని చెప్పారు.
చొక్కా పట్టుకోండి
మా ఎన్నికల్లో ఇంతటి ఆధిక్యతంతో గెలవడం ఇదే ప్రథమమనీ, దీన్ని బట్టి ఎక్కువమంది నన్ను పనిచేయమని కోరుకొంటున్నట్టు భావిస్తున్నా అన్నారు. ఈ క్షణం నుంచి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్లో ప్రతి మెంబర్కీ నేను సేవకుడినిననీ, హామీల్ని నెరవేర్చకపోతే చొక్కా పట్టుకొని అడగొచ్చని అన్నారు రాజేంద్రప్రసాద్.
శివాజీరాజా మాట్లాడుతూ...
ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శివాజీ రాజా మాట్లాడుతూ ఇచ్చిన హామీల్ని నెవరేర్చినప్పుడు నిజమైన విజయంగా భావిస్తామనీ, అగ్ర కథానాయకులందరినీ కలిసి తదుపరి కార్యచరణ చేపడతామన్నారు. రాజేంద్రప్రసాద్ వెనకాల ఉంటూ కళాకారులకు సేవ చేస్తామన్నారు.
ఇదీ ఓటింగ్ సరళి
'మా'లో మొత్తం 702 మంది సభ్యులుండగా... 394 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. అందులో రాజేంద్రప్రసాద్కి 237 ఓట్లు రాగా, జయసుధకి 152 ఓట్లు లభించాయి. అధ్యక్ష పదవి కోసం పోటీ పడిన మరో అభ్యర్థి బొమ్మరిల్లు ధూళిపాళకు కేవలం 5 ఓట్లు మాత్రమే పడ్డాయి. కార్యవర్గంలోని వివిధ పదవుల కోసం మొత్తం 37 మంది పోటీపడ్డారు.
ఏకగ్రీవం
ఉపాధ్యక్షుల స్థానం కోసం బరిలోకి దిగిన శివకృష్ణ, మంచు లక్ష్మి ప్రసన్నలకు పోటీ లేకపోవడంతో వారిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన పదవుల కోసం ఎన్నికలు జరిగాయి.
గెలిచిన వారు
ఆ ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడిగా తనికెళ్ల భరణి, ప్రధాన కార్యదర్శిగా శివాజీరాజా, కోశాధికారిగా పరుచూరి వెంకటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శులుగా నరేష్, రఘుబాబు, కార్యవర్గ సభ్యులుగా బెనర్జీ, బ్రహ్మాజీ, ఛార్మి, ఢిల్లీ రాజేశ్వరి, ఏడిద శ్రీరామ్, మహర్షి రాఘవ, శ్రీశశాంక, గీతాంజలి, ఎం.హరనాథ్బాబు, హేమ, జాకీ, జయలక్ష్మి, కాదంబరి కిరణ్, కృష్ణుడు, నర్సింగ్ యాదవ్, పసునూరి శ్రీనివాసులు, రాజీవ్ కనకాల, విద్యాసాగర్ గెలుపొందారు.