నన్ను హింసించకండి.. ప్రాణాలు పోతుంటే ప్యానెల్ పెడతారా: మా ప్రెసిడెంట్ నరేష్ సంచలన వ్యాఖ్యలు
తెలుగు సినీ ఇండస్ట్రీలో కొద్ది రోజులుగా 'మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్' ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. ప్రస్తుత పాలకవర్గం పదవీ కాలం ముగియడానికి చాలా సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే ఎన్నికల వేడి మొదలైంది. ఈ క్రమంలోనే నలుగురు అభ్యర్థులు కూడా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ను కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత 'మా' ప్రెసిడెంట్ నరేష్ ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా తాను చేసిన పనులతో పాటు ప్రకాశ్ రాజ్ తీరుపై విమర్శలు గుప్పించారు. ఆ సంగతులు మీకోసం!
Recommended Video

అధ్యక్ష బరిలో నలుగురు ప్రముఖులు
కొద్ది రోజుల్లో జరగబోతున్న 'మూవీ ఆర్టిస్టు అసోషియేషన్' ఎన్నికల కోసం ఈ సారి ఏకంగా నలుగురు ప్రముఖులు (ప్రకాశ్ రాజ్, జీవితా రాజశేఖర్, మంచు విష్ణు, హేమ) బరిలో నిలిచారు. ఇప్పటికే వీళ్లంతా తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకున్నారు. అదే సమయంలో అందుబాటులో ఉన్న సినీ పెద్దలతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. దీంతో 'మా'లో హడావిడి కనిపిస్తోంది.

ప్యానెల్ ఏర్పాటు.. ప్రెస్మీట్తో సిద్ధంగా
'మూవీ ఆర్టిస్టు అసోషియేషన్' ఎన్నికల కోసం ప్రకాశ్ రాజ్ ఎప్పటి నుంచో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందుకే అందరి కంటే ముందే తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, ఇప్పటికే 27 మంది సభ్యులతో కూడిన ప్యానెల్ను కూడా ప్రకటించారు. అంతేకాదు, శుక్రవారమే వాళ్లందరితో కలిసి ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు.

లెక్కలతో సహా వచ్చేన ప్రెసిడెంట్ నరేష్
పాలక వర్గానికి సెప్టెంబర్ వరకూ గడువు ఉన్నప్పటికీ 'మూవీ ఆర్టిస్టు అసోషియేషన్' ఎన్నికల కోసం అప్పుడే హడావిడి మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత 'మా' ప్రెసిడెంట్ నరేష్ తాజాగా ప్రెస్మీట్ నిర్వహించారు. దీనికి శివ బాలాజీ, గౌతంరాజు సహా మరికొందరు మెంబర్లను కూడా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తమ హయాంలో చేసిన వాటిని లెక్కలతో సహా చూపించే ప్రయత్నం చేశారు.

ఎవరికి ఏమి చేశామో వివరించిన నరేష్
ఈ ప్రెస్మీట్తో నరేష్ భావోద్వేగంగా మాట్లాడారు. 'మా హయాంలో ఎవరికి ఏం చేశామో లెక్కలతో సహా నోట్ చేసుకున్నాం. ఇవన్నీ మీడియాకు, ప్రకాశ్ రాజ్ గారికి కూడా అందజేస్తాం. మాకు ఓ ఏడాదంతా కరోనా వల్ల పోయింది. ఆ సమయంలో ఎంతో మందికి సహాయం చేశాం. 900 మంది సభ్యుల్లో 700 ఇళ్లు తిరిగి అందరి యోగక్షేమాలు తెలుసుకున్నాం' అని వెల్లడించారాయన.

కరోనా సమయంలో అలాంటి పనులతో
కోవిడ్ సమయంలో ఆర్టిస్టుల్లో చాలా మంది ఇబ్బందులు పడ్డారని వివరిస్తూ.. 'ఈ మధ్యనే ఓ సీనియర్ నటి సహాయం కోరింది. దీంతో వెంటనే రూ. 40 వేల ఇంజెక్షన్లు ఐదు ఇప్పించాం. స్వయంగా ఎంతో మందికి ఆర్థిక సహాయం అందించాం. అలాగే, 'మా' తరపున చిన్న చిన్న ఆర్టిస్టులకు హెల్త్ ఇన్స్రెన్స్లు చేయించాం.బెడ్లు, ఆక్సీజన్ సౌకర్యాలు ఏర్పాటు చేశాం' అని నరేష్ తెలిపారు.

ఆ నటులంతా ముందుకు వచ్చారంటూ
'మా' కోసం ఎంతో మంది నటులు ముందుకొచ్చారని నరేష్ వెల్లడించారు. 'ఆర్టిస్టుల కోసం కృష్ణంరాజు గారు, రావు రమేష్ గారు, బాలీవుడ్ యాక్టర్ జాకీ ష్రాఫ్ గారు తమ వంతుగా డబ్బులు పంపించారు. మా ఫ్రెండ్స్ కూడా అర్థిక సహాయం చేశారు. వీళ్లతో పాటు 87 మంది కొత్త నటులు సభ్యత్వం తీసుకున్నారు. వాటికి సంబంధించిన లెక్కలన్నీ ఆఫీస్లో ఉంచాం' అని పేర్కొన్నారు.

ప్రాణాలు పోతుంటే ప్యానెల్ పెడతారా?
'మా' ఎన్నికల గురించి మాట్లాడుతూ.. 'ఎన్నికలకు సెప్టెంబర్ వరకూ సమయం ఉంది. అయినా ప్రెసిడెంట్గా నేను ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇవేమీ జరగకముందే పోటీ చేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. ప్యానెళ్లు ఏర్పాటు చేస్తున్నారు. మేము ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేయాలని చూస్తుంటే ఎన్నికలేంటి? బయట ప్రాణాలు పోతుంటే ప్యానెళ్లా? ఇలాంటి పనులతో నన్ను హింసించకండి' అంటూ నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.


Click it and Unblock the Notifications











