అశ్వినీదత్-దిల్ రాజు నిర్మాతలుగా మహేష్ 25వ మూవీ ఖరారు
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన ఇద్దరు పెద్ద నిర్మాతలు సంయుక్తంగా మహేష్ బాబు సినిమాను నిర్మించబోతుండటం ఆసక్తి కరంగా మారింది. 2017లో ప్రారంభం కాబోతోన్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించబోతున్నారు.
'ఊపిరి' లాంటి హిట్ చిత్రాలను నిర్మించిన వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. మహేష్ బాబు కెరీర్లో ఇది 25వ మూవీ. ఈ సినిమా పివిపి చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే అనుకోని కారణాలతో ఈ చిత్రం అశ్వినీ దత్, దిల్ రాజు చేతుల్లోకి వెళ్లింది.

'జగదేక వీరుడు అతిలోక సుందరి, ఇంద్ర, చిరుత' వంటి భారీ సినిమాల్ని నిర్మించిన వైజయంతి మూవీస్, 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఎవడు, బొమ్మరిల్లు' వంటి సక్సెస్ ఫుల్ సినిమాల్ని తీసిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ భారీ లెవల్లో ఉంటుందని అంటున్నారంతా. ఇక ఈ చిత్రంలో హీరోయిన్, ఇతర నటీ నటులెవరు అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం మహేష్ బాబు తన 23వ సినిమా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ చిత్రానికి 'సంభవామి' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. మహేష్ బాబు 24వ మూవీ కొరటాల శివ దర్శకత్వంలో ఉంటుంది. ఇటీవలే ఈచిత్రం ప్రారంభోత్సవం జరుపుకోగా....త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్రానికి 'భరత్ అను నేను' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.


Click it and Unblock the Notifications











