Guntur Kaaram: మహేశ్ ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్.. 'ఒక్కడు' తర్వాత మళ్లీ అలా!
సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టిన మహేశ్ బాబు అతి తక్కువ కాలంలోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ సుధీర్ఘ కాలంగా సత్తా చాటుతున్నాడు. మహేశ్ బాబు నేడు (ఆగస్టు 9) 48వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. దీంతో ఆయనకు ఫ్యాన్స్ అంతా బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. అలాగే గుంటూరు కారం సినిమా నుంచి కొత్త పోస్టర్ విడుదల కాగా దానిపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.
బాల నటుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మహేశ్ బాబు సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఒక్కడు, పోకిరి, దూకుడు వంటి అదిరిపోయే ఇండస్ట్రీ హిట్స్ తో సత్తా చాటిన మహేశ్ బాబు 'భరత్ అనే నేను' నుంచి వరుసగా 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు', 'సర్కారు వారి పాట' వంటి భారీ హిట్లు తన ఖాతాలో వేసుకుని హవా చాటాడు. దీంతో మరింత జోరుగా సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. మహేశ్ బాబు ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్న విషయం తెలిసిందే.

రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు చేస్తున్న సినిమా SSMB29. అయితే నేడు మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా దీని నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మహేశ్ బాబు చేస్తున్న మూడో సినిమా గుంటూరు కారం. దీని నుంచి ఇదివరకే అర్ధరాత్రి 12:06 గంటలకు ఊరమాస్ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో మహేశ్ బాబు లుంగీలో బీడీ కాలుస్తూ స్టైలిష్ గా కనిపించాడు. పోస్టర్ బాగున్నప్పటికీ గ్లింప్స్, టీజర్ వంటి భారీ ఊహల కారణంగా నిరాశ చెందారు. ఇప్పుడు వారిని కూల్ చేసేందుకు తాజాగా మరో పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.
గుంటూరు కారం నుంచి తాజాగా విడుదలైన మరో పోస్టర్ లో మహేశ్ బాబు తలకు ఎర్ర తుండు కట్టుకుని సన్ గ్లాసెస్ తో కనిపించాడు. అంతేకాకుండా చుట్టూ విలన్స్ ఉంటే వారితో ఫైట్ చేసేందుకు సిద్ధంగా మహేశ్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో మహేశ్ బాబు రౌడీలతో కబడ్డీ ఆడతాడని ఒక టాక్ నడిచింది. ఈ పోస్టర్ చూస్తుంటే ఆ సీన్ కు సంబంధించినదానిలాగే ఉందని తెలుస్తోంది. కబడ్డీ కూతతో మహేశ్ బరిలో దిగినట్లుగా ఉంది ఆ పోస్టర్.
ఒక్కడు మూవీ తర్వాత గుంటూరు కారంలో మహేశ్ బాబు మళ్లీ కబడ్డీ ఆట ఆడనున్నాడు. కాగా ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ చేయనున్నారు. ఇందులో హీరోయిన్లుగా శ్రీలీల, మీనాక్షి చౌదరి చేస్తున్నారు. తమన్ ఎస్ మ్యూజిక్ అందిస్తుండగా.. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.


Click it and Unblock the Notifications











