Ramesh Babu death 12వ ఏటనే నటుడిగా.. అమితాబ్ మూవీకి నిర్మాతగా.. మహేష్ ఫ్యామిలీ ఎమోషనల్ మెసేజ్
సూపర్స్టార్ కృష్ణ కుమారుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు ఘట్టమనేని ఇక లేరు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి 10.30 ప్రాంతంలో మరణించారు. ఆయన మృతికి పవన్ కల్యాణ్తోపాటు పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఈ విషాదం సమయంలో రమేష్ బాబు సినీ కెరీర్ గురించి, ఆయన అభిమానులకు, కృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్స్ కొసం కుటుంబ సభ్యులు విడుదల చేసిన సందేశం గురించిన వివరాల్లోకి వెళితే..

కాలేయ వ్యాధితో బాధపడుతూ..
రమేష్ బాబు గత కొద్దికాలంగా కాలేయ సంబంధింత వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించారని వైద్యులు ధ్రువీకరించారు. శనివారం రాత్రి ఆయన మృతదేహాన్ని ఏఐజీ మార్చురీలో ఉంచారు. ఆదివారం ఉదయం తన నివాసానికి తీసుకెళ్తున్నట్టు సన్నిహితులు వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.

12వ ఏటనే సినీ రంగ ప్రవేశం
రమేష్ బాబు సినీ కెరీర్ విషయానికి వస్తే.. సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా రమేష్ బాబు తన చిన్నతనంలోనే సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. తన 12వ ఏటనే తండ్రి కృష్ణతో కలిసి మనుషులు చేసిన దొంగలు చిత్రంలో నటించడం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు రూపొందించిన నీడ చిత్రంలో కీలక పాత్రతో ఆకట్టుకొన్నారు. ఆ తర్వాత 1987 చిత్రంలో పూర్తిస్థాయి హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.

బేతాబ్ రీమేక్ ద్వారా హీరోగా
హిందీలో ఘన విజయం సాధించిన బేతాబ్ చిత్రం రీమేక్గా రూపొందిన సామ్రాట్ చిత్రం ద్వారా రమేష్ బాబు హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత చిన్ని కృష్ణుడు చిత్రంలో నటించారు. హీరోయిన్గా పరిచయమైన ప్రస్తుత సీనియర్ నటి నదియాతో కలిసి నటించిన బజార్ రౌడీ చిత్రం రమేష్ బాబు భారీ విజయాన్ని అందించింది. ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకోవడానికి చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. ఆయన తన కెరీర్లో నటించిన చివరి చిత్రం ఎన్కౌంటర్. 1997లో చివరిసారిగా స్క్రీన్పై కనిపించారు.

అమితాబ్ సినిమాకు నిర్మాతగా
నటుడిగా తన ప్రస్థానాన్ని ముగించిన తర్వాత 1997లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ నటించిన సూర్యవంశం హిందీ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు. ఆ తర్వాత మహేష్ బాబు, గుణశేఖర్ కాంబినేషన్లో వచ్చిన అర్జున్ చిత్రానికి నిర్మాతగా వ్యవహారించారు. నిర్మాతగా అతిథి, దూకుడు, ఆగడు చిత్రాలకు వ్యవహరించారు. 2014లో వచ్చిన ఆగడు చిత్రమే నిర్మాతగా అతడికి చివరి చిత్రంగా మారింది.

మహేష్ బాబు ఫ్యామిలీ మెసేజ్
నటుడు, నిర్మాత రమేష్ బాబు మరణంపై ఘట్టమనేని కుటుంబం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఘట్టమనేని రమేష్ బాబు ఇకలేరనే వార్తను అత్యంత విషాదంతో తెలియజేస్తున్నాం. భౌతికంగా దూరమైనప్పటికీ.. మన మనసులో చిరస్థాయిగా నిలిచిపోతారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ కోవిడ్ ప్రొటోకాల్స్ పాటించండి. సాధ్యమైనంత వరకు అంత్యక్రియలకు దూరంగా ఉండండి అని కృష్ణ కుటుంబ సభ్యులు ఓ ప్రకటనను విడుదల చేశారు.


Click it and Unblock the Notifications











