బోయపాటికి మొహం మీదే ఆ విషయం చెప్పేసిన మహేష్?: చాలా మారిపోయాడు..
'డైరెక్టర్స్ యాక్టర్'.. ఇండస్ట్రీలో మహేష్ బాబుకు ఉన్న పేరు ఇది. సెట్ లోకి వచ్చాక డైరెక్టర్ ఏది చెబితే అది చేసేయడమే తప్పా.. అలా ఎందుకు?, ఇలా ఎందుకు తీయకూడదు? వంటి అనవసర విషయాల జోలికి వెళ్లరు. అయితే దర్శకుల విషయంలో మహేష్ మరి బ్లైండ్గా వెళ్తుండటం వల్లే వరుస ఫ్లాప్స్ వస్తున్నాయన్న విమర్శ కూడా లేకపోలేదు. దీంతో మహేష్ కూడా ఆలోచనలో పడ్డాడట.. మొహమాటానికి పోకుండా కథల విషయంలో దర్శకులకు సూటిగా తన నిర్ణయం చెప్పేయాలనుకుంటున్నాడట..

గుడ్డిగా నమ్మి బోల్తా పడ్డాడు..
ఒకసారి హిట్ ఇచ్చిన దర్శకుడిని గుడ్డిగా నమ్మేస్తుంటాడు మహేష్. ఇలా నమ్మే గతంలో గుణశేఖర్ తో 'సైనికుడు' లాంటి డిజాస్టర్ మూటగట్టుకున్నాడు. ఒక్కడు హిట్ తర్వాత కేవలం గుణశేఖర్ పై ఉన్న నమ్మకంతో కథ కూడా వినకుండా మహేష్ సైనికుడు కమిట్ అయ్యాడంటారు. ఫలితం అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత కూడా మహేష్ పాఠాలు నేర్వలేదు.

వరుస ఫ్లాప్స్కు కారణమదే..:
దూకుడు లాంటి హిట్ ఇచ్చిన శ్రీనువైట్లను నమ్మి ఆగడు సినిమా చేశాడు మహేష్. ఆ సినిమా దారుణంగా బెడిసికొట్టింది. శ్రీకాంత్ అడ్డాల విషయంలోనూ ఇదే రిపీట్ చేశాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి హిట్ తర్వాత శ్రీకాంత్తో బ్రహ్మోత్సవం చేశాడు.
అదీ దారుణంగా దెబ్బేసింది. ఇక మురుగదాస్కు ఉన్న బ్రాండ్ను నమ్ముకుని స్పైడర్ కమిట్ అయ్యాడు. ఇది కూడా బిగ్ డ్యామేజ్ నే మిగిల్చింది. వీటన్నింటిల్లోనూ తప్పు ఎక్కడ జరిగిందంటే.. మహేష్ కథ గురించి పట్టించుకోకుండా కేవలం దర్శకులను నమ్ముకోవడమే అంటారు.

మహేష్ మారాడా?:
ఇన్ని ఫ్లాప్స్ తర్వాత మహేష్ బాబు ఇప్పుడు అలర్ట్ అయ్యాడన్న ప్రచారం జరుగుతోంది. కథల విషయంలో ఎన్నడూ లేనివిధంగా ఆయన ఎక్కువ శ్రద్ద కనబరుస్తున్నారట. ఈ క్రమంలో వంశీ పైడిపల్లితో కమిట్ అయిన ప్రాజెక్ట్ విషయంలోనూ.. అలాగే బోయపాటి శ్రీనుతో చేయబోయే సినిమా విషయంలోనూ.. కథ పట్ల నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నాడట.

వంశీని మళ్లీ వర్కౌట్ చేయమన్నాడట..
వరుస ఫ్లాప్స్ కలవరపెడుతుండటంతో మహేష్ తన పంథా మార్చుకోక తప్పలేదని తెలుస్తోంది. అందుకే వంశీ పైడిపల్లిని కథ పకడ్బందీగా తయారుచేయాలని చెప్పాడట. ఇప్పటికే కథ పూర్తయిపోయిందని చెప్పినా.. అయినా సరే మళ్లీ ఓసారి చెక్ చేసుకోవాలని వంశీకి సలహా ఇచ్చాడట.

మొహం మీదే చెప్పేశాడట..:
ఇక దర్శకుడు బోయపాటి శ్రీనుకు కథ నచ్చలేదని మొహం మీదే చెప్పేశాడట మహేష్. ఇలాంటి కథను పక్కనపెట్టి అవసరమైతే కొత్త లైన్ తీసుకుని వర్కౌట్ చేయాలని చెప్పాడట. కథ తనకు సంతృప్తికరంగా అనిపిస్తేనే మీతో సినిమా చేస్తానని సూటిగా చెప్పేశాడట. దీంతో బోయపాటి మళ్లీ కథకు మరమ్మత్తులు చేసే పనిలో నిమగ్నమయ్యాడట.

కొరటాల ఎటువైపు?
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అనే నేను'లో నటిస్తున్నాడు మహేష్. శ్రీమంతుడు హిట్ తర్వాత కొరటాలపై నమ్మకంతో మరో ఛాన్స్ ఇచ్చాడు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఇంతకుముందు చాలామంది దర్శకులు విఫలమయ్యారు.
గుణశేఖర్,త్రివిక్రమ్, శ్రీనువైట్ల, శ్రీకాంత్ అడ్డాల.. వీళ్లంతా మహేష్తో రెండో సినిమా చేసి ఫ్లాప్ ఇచ్చినవాళ్లే. ఒక్క పూరి జగన్నాథ్ తప్ప. మరి కొరటాల పూరి జగన్నాథ్ సరసన నిలుస్తాడా? లేక మొదటి జాబితాలోనే చేరిపోతాడా అన్నది వేచి చూడాల్సిందే. మహేష్ 'భరత్ అనే నేను' ఏప్రిల్ నెలలో విడుదలయ్యే అవకాశాలున్నాయి.


Click it and Unblock the Notifications











