నే హీరోని కావడానికి స్ఫూర్తి... మహేష్బాబు
హైదరాబాద్ : '' హీరోని కావడానికి స్ఫూర్తి... మహేష్బాబు. ఆయన్నుంచి నేర్చుకోవాలనే 'ఖలేజా' చిత్రానికి సహాయ దర్శకునిగా పనిచేశా. ఒక నటుడు సెట్లో ఎలా కష్టపడాలో తెలుసుకొన్నాకే కెమెరా ముందుకు అడుగుపెట్టా. కథని, కష్టాన్ని నమ్మి చేసిన మా ఈ ప్రయత్నం మంచి ఫలితాన్నిస్తుందని నమ్ముతున్నా'' అన్నారు కృష్ణమాధవ్. మహేష్బాబుకి దగ్గరి బంధువీయన. 'హృదయం ఎక్కడున్నది' చిత్రంతో హీరోగా తెరకు పరిచయమవుతున్నారు. ఈ నెల 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా కృష్ణమాధవ్ హైదరాబాద్లో మీడియాతో ముచ్చటించారు.
కృష్ణ మాధవ్ మాట్లాడుతూ... ''మనం చేసే పాత్ర ప్రేక్షకులకు నచ్చాలి, అప్పుడే వ్యక్తిగతంగా గుర్తింపు లభిస్తుందన్న విషయాన్ని తెలుసుకొనే ఈ వైపు అడుగేశా. ఇందులో నేను ఆర్కిటెక్ట్ పాత్రలో కనిపిస్తాను. మనలో చాలా మంది ఉన్నదానితో సంతృప్తిచెందం. ఇంకా కావాలని కోరుకుంటాం. అది ప్రేమ విషయంలోనైనా కావొచ్చు, డబ్బు విషయంలోనైనా కావొచ్చు. మా సినిమాలో హీరో అప్పటికే ఒకమ్మాయితో ప్రేమలో ఉంటాడు. కానీ మరో యువతిని చూసి మనసుపారేసుకొంటాడు. అసలు తనకు ఏం కావాలన్న విషయంపై స్పష్టత లేని ఆ కుర్రాడి ప్రయాణం ఎక్కడిదాకా చేరిందన్నది తెరపైనే చూడాలి. దర్శకుడు వి.ఆనంద్ ఎంతో స్పష్టతతో చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఆయన త్వరలో మురుగదాస్ నిర్మాణంలో ఓ సినిమా కూడా చేయబోతున్నారు''ని తెలిపారు కృష్ణమాధవ్. త్వరలోనే మహేష్బాబుకి ఈ సినిమా చూపించబోతున్నట్టు కృష్ణమాధవ్ తెలిపారు.

అలాగే''దూకుడు, ఖలేజా చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాను. ఆ సమయంలో మహేష్బాబుని చూసి చాలా ఇన్స్ఫైర్ అయ్యాను. ఆయన్నుంచి కమిట్మెంట్, డిసిప్లేన్, హార్డ్వర్క్ నేర్చుకున్నాను. నాకు రోల్ మోడల్ ఆయన. సినిమాల్లో నటించాలనేది కల మాత్రమే కాదు, మా నాన్నగారిది కూడా. ఈ రోజు నా కల నెరవేరినందుకు చాలా ఆనందంగా వుంది. మంచి కథతో ఈ సినిమా చేశాను. పాటలు అందరికీ నచ్చుతాయి. కొత్తవాడినైనప్పటికీ నిర్మాతలు ఎంతగానో ప్రోత్సహించారు''అని చెప్పారు.
దర్శకుడు వి.ఐ ఆనంద్ మాట్లాడుతూ-''మురుగదాస్ వద్ద పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాను. నేను సినిమాకు డైరెక్ట్ చేస్తున్నాను అని ఆయనకు చెప్పినప్పుడు ఆల్ ద బెస్ట్ చెప్పారు. బడ్జెట్, జోనర్, ఆర్టిస్ట్లు అనేది తరువాత విషయం. మొదట హ్యూమన్ ఎమోషన్స్ ఉన్న సినిమా తీయమని చెప్పారు. ఆయన చెప్పిన మాటలు ప్రతి రోజు సెట్లో గుర్తుకు వచ్చేవి. ఆ విధంగానే తెరకెక్కించారు. రొటీన్ సినిమాల్లా కాకుండా, డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్న చిత్రమిది. ప్రతీ ఒక్కరికీ నచ్చుతుంది. ఈ చిత్రానికి విశాల్ శేఖర్ చక్కటి సంగీతాన్ని అందించారు''అని పేర్కొన్నారు.
ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ఆహుతి ప్రసాద్, ప్రసాద్బాబు, హర్షవర్ధన్, రజిత, అనంత్, ధనరాజ్, పృథ్వీ, ఫణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, ఎడిటింగ్: శ్రవణ్, ఆర్ట్: శ్రీకాంత్, కెమెరా: ప్రసాద్ జి.కె.


Click it and Unblock the Notifications











