Mahesh Babu:సామాజిక సేవలో మహేష్ మరో ముందడుగు.. ఇప్పటి మరింత మందికి సేవలు?
మన హీరోలు కేవలం సినిమాలు చేసి డబ్బులు సంపాదించడమే కాదు మానవత్వం కూడా ముందే ఉంటారు.. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ వంటి వారు బ్లడ్ బ్యాంక్, హాస్పిటల్స్ ద్వారా సేవ చేస్తూ ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ముందు నుంచి చిన్న పిల్లలకు సర్జరీలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా ఆయన తన సేవా కార్యక్రమాల్లో మరో ముందడుగు వేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

వేయి మంది చిన్నారులకు
హృదయ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్న చిన్నారులు మళ్ళీ మామూలు మనుషులు అయ్యేందుకు గాను మహేష్ బాబు గతంలో ఓ చారిటీ సంస్థ స్థాపించారు. మహేష్ బాబు ఫౌండేషన్ పేరుతో నడుస్తున్న ఈ చారిటీ సంస్థ సుమారు వేయి మంది చిన్నారులకు అవసరమైన వైద్యం అందించింది కూడా.

పేదవారి సంగతేమిటి?
ఇక చిన్న పిల్లలకు ఇలాంటి వైద్య సేవలు అందించడానికి కారణాన్ని కూడా మహేష్ ఇటీవల వెల్లడించారు. బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షోలో పాల్గొన్న మహేష్ ని బాలయ్య ఈ విషయం అడుగగా... గౌతమ్ ఏడు నెలలకే జన్మించాడు. వాడిని కాపాడుకోవడానికి ఖరీదైన వైద్యం అందించాల్సి వచ్చింది. మనకు డబ్బులు ఉన్నాయి కాబట్టి కాపాడుకోగలిగాం... మరి పేదవారి సంగతేమిటి? అనే ఆలోచన కలిగింది. అప్పటి నుండి గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఉచిత వైద్యం చేయిస్తున్నాను.. అని తెలిపారు.

మరొక సంస్థతో
ఆర్థికంగా వెనుకబడిన తల్లిదండ్రులు తమ చిన్నారులు ప్రమాదకరమైన, ఖర్చుతో కూడుకున్న హృదయ సంబంధిత వ్యాధుల బారిన పడి చికిత్స కోసం ఇబ్బంది పడకుండా మహేష్ బాబు ఫౌండేషన్ వారికి అండగా నిలుస్తోంది. ఆర్థిక స్థోమత లేని తల్లిదండ్రులు తమ పిల్లలకు అవసరమైన హృదయ సంబంధించిన చికిత్స ఈ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా పొందవచ్చు. ఈ క్రమంలో మరింత మంది చిన్నారులకు సేవలు అందించడానికి మహేష్ ఫౌండేషన్ మరొక సంస్థతో చేతులు కలిపారు.

ప్యూర్ లిటిల్ హార్ట్ ఫౌండేషన్ తో
ఇప్పటి దాకా ఆంధ్రా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆపరేషన్స్ చేయిస్తూ వచ్చిన మహేష్ బాబు ఫౌండేషన్ మరో ముందడుగు వేసింది. అదేమంటే రైన్ బో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ప్యూర్ లిటిల్ హార్ట్ ఫౌండేషన్ ఏర్పాటు అయింది. ఆ ఫౌండేషన్ తోనే ఇప్పుడు మహేష్ ఫౌండేషన్ చేతులు కలిపింది. ఈ మేరకు రైన్ బో హాస్పిటల్ ప్రతినిధులతో మహేష్ సమావేశం అయ్యారు. ఈ విషయాన్ని మీడియా ముఖంగా తెలియజేయడంతో పాటు లోగో ఆవిష్కరించారు.

సినిమాల విషయానికి వస్తే
తద్వారా ఆర్థికంగా వెనుకబడి ఉన్న మరింత మంది పేద పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయబోతున్నారు. పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో దాదాపు 2 లక్షల మంది పిల్లలు బాధపడుతున్నారు. మరోపక్క మహేష్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సెట్స్ పై ఉంది. మే 12న సమ్మర్ కానుకగా ఈ మూవీ విడుదల కానుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఆయన త్రివిక్రమ్ సినిమాలో నటించనున్నారు.


Click it and Unblock the Notifications











