కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మహేష్ బాబు విజ్ఞప్తి.. పెద్దఎత్తున స్పందిస్తున్న నెటిజన్లు
హైదరాబాద్ నగరంలో శంషాబాద్ శివారులో వైద్యురాలిపై జరిగిన అమానుష ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ దుర్ఘటనపై పెద్ద ఎత్తున టాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇప్పటికే కీర్తి సురేష్, సుధీర్ బాబు, అల్లరి నరేష్, చిరంజీవి లాంటి ఎందరో సినీ ప్రముఖులు ఈ ఉదంతాన్ని ఖండిస్తూ తమ స్పందన తెలియజేశారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఓ కవిత రూపంలో తన మనసులోని భావాలను వ్యక్తపరిచారు. వాయిస్ ఓవర్ చెబుతూ ఓ వీడియోను షేర్ చేస్తూ.. ఎవరి కళ్లలో సంస్కారం సూర్యకాంతిలా మెరుస్తుందో.. ఎవరి మాట మన్ననగా ఉంటుందో.. ఎవరి మనసు మెత్తగా ఉంటుందో.. ఎవరి ప్రవర్తన మర్యాదగా ఉంటుందో.. ఎవరికి ఆడవాళ్లంటే హృదయంలో అభిమానం.. సమాజంలో గౌరవం ఉంటాయో.. ఎవరు వాళ్ల శరీరానికి, మనసుకి విలువిస్తారో అంటూ ఆలోచింపజేసేలా ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.

ఇక తాజాగా దానికి కొనసాగింపుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ మరో ట్వీట్ చేశారు మహేష్. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి కానీ.. సమాజంలో పరిస్థితులు మాత్రం మారడం లేదని, ఉన్నత విలువలను సాధించడంలో విఫలమవుతున్నామని ట్వీట్ చేశారు. ఇలాంటి భయంకరమైన నేరాలను అరికట్టడానికి మరిన్ని కఠిన చట్టాలు తేవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని ఈ సందర్బంగా మహేశ్ బాబు పేర్కొన్నారు. అందరం కలిసి మహిళలకు అండగా నిలుద్దామని, దేశాన్ని సురక్షితంగా మార్చుకుందామని మహేష్ తెలిపారు. ఆయన చేసిన ఈ ట్వీట్పై పెద్ద ఎత్తున స్పందిస్తూ తమ అండదండలు మహిళలకు ఎప్పుడూ ఉంటాయని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.


Click it and Unblock the Notifications











