Pushpa మూవీపై మహేశ్ బాబు రివ్యూ: అల్లు అర్జున్పై ఊహించని విధంగా.. రష్మికకు మాత్రం షాకే!
రెండేళ్ల క్రితం 'అల.. వైకుంఠపురములో' అనే చిత్రంతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ను ఖాతాలో వేసుకున్నాడు టాలీవుడ్ బడా హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ ఉత్సాహంతోనే ఆ వెంటనే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే సినిమాను చేశాడు. పాన్ ఇండియా రేంజ్లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా గత నెలలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి ఆరంభం నుంచే భారీ స్పందన వస్తోంది. ఫలితంగా కలెక్షన్లు కూడా పోటెత్తుతున్నాయి. దీంతో ఎన్నో రికార్డులు కూడా బద్దలైపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా పుష్ప మూవీపై మహేశ్ బాబు రివ్యూ ఇచ్చాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

పుష్పగా ఎంట్రీ ఇచ్చిన ఐకాన్ స్టార్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన చిత్రమే 'పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్గా చేశాడు. సునీల్, అనసూయ ఈ చిత్రంలో నెగెటివ్ రోల్స్ చేశారు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

అన్ని భాషల్లోనూ పుష్ప భారీ హిట్
అల్లు అర్జున్.. సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన 'పుష్ప' మూవీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో తెరకెక్కింది. ఇలా దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. అందుకు అనుగుణంగానే అన్ని చోట్లా దీనికి భారీ రెస్పాన్స్ వచ్చి సూపర్ హిట్ అయింది. మరీ ముఖ్యంగా హిందీలో ఈ సినిమా ఊహించని రీతిలో కలెక్షన్లను కొల్లగొడుతూ రికార్డులు కొట్టేసింది.

టార్గెట్ ఫినీష్.. ఎంత లాభమంటే
పాన్ ఇండియా రేంజ్లో వచ్చిన 'పుష్ప' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 146 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 17 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 158.03 కోట్లు వసూలు చేసింది. దీంతో హిట్ స్టేటస్తో పాటు రూ. 12.03 కోట్ల లాభాలను కూడా సొంతం చేసుకుంది.

పుష్ప మూవీపై మహేశ్ బాబు రివ్యూ
క్రేజీ కాంబినేషన్లో వచ్చిన 'పుష్ప' మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. అంతేకాదు, ఈ సినిమాపై సినీ ప్రముఖులు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు పుష్ప మూవీని చూశాడని తెలిసింది. అంతేకాదు, అతడు దీనిపై ట్విట్టర్ వేదికగా రివ్యూను కూడా ఇచ్చాడు.

బన్నీపై అలా... సుకుమార్పై ఇలా
టాలీవుడ్లోని ఏ హీరో సినిమా అయినా బాగుంటే ప్రశంసిస్తూ ట్వీట్లు చేస్తుంటాడు మహేశ్ బాబు. ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా 'పుష్ప' మూవీపై ట్విట్టర్లో 'పుష్పగా అల్లు అర్జున్ నటన స్టన్నింగ్, ఒరిజినల్, సెన్సేషనల్గా ఉంది. అతడిది అసాధారణమైన నటన. తన సినిమాలు ఎంత వాస్తవంగా, పచ్చిగా, నిజాయితీగా ఉంటాయో సుక్కూ నిరూపించాడు' అని చెప్పుకొచ్చాడు.

అతడి గురించి ఏం చెప్పాలంటూ
'పుష్ప' మూవీకి పని చేసిన టెక్నీషియన్ల గురించి కూడా మహేశ్ బాబు ట్వీట్ చేశాడు. మరో దానిలో 'నీ గురించి ఏం చెప్పాలి? దేవి శ్రీ ప్రసాద్ నువ్వు రాక్స్టార్వి. 'పుష్ప' సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ టీమ్ మొత్తానికి కంగ్రాట్స్. బాయ్స్.. చాలా గర్వంగా ఉంది' అంటూ చెప్పుకొచ్చాడు. మహేశ్ చేసిన ఈ ట్వీట్లకు బన్నీ ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది.
Recommended Video

రష్మిక పేరు తీయకపోవడంతో షాక్
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీపై సూపర్ స్టార్ మహేశ్ బాబు చేసిన ట్వీట్పై అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ, రష్మిక మందన్నా అభిమానులు మాత్రం గుర్రుగా ఉన్నారు. దీనికి కారణం అతడు చేసిన రెండు ట్వీట్లలోనూ హీరోయిన్ రష్మిక మందన్నా పేరును ప్రస్తావించలేదు. దీంతో ఆమె ఫ్యాన్స్ నెగెటివ్ కామెంట్లను పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











