డియర్ ఫ్రెండ్ అంటూ... త్రివిక్రమ్ గురించి మహేష్ బాబు ట్వీట్!
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు విష్ చేశారు.డియర్ ఫ్రెండ్ అని సంభోదిస్తూ తన ఇష్టమైన దర్శకుడికి విషెస్ తెలిపారు.
విక్రమ్ శ్రీనివాస్... తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. రచయితగా అతి తక్కువ కాలంలోనే తెలుగులో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఓ బ్రాండ్ నేమ్ క్రియేట్ చేసుకున్నారు.
తెలుగు సినిమా రంగంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న మాటల రచయితగా త్రివిక్రమ్ ఒకప్పుడు చరిత్ర సృష్టించారు. కోటి రూపాయల పారితోషికం తీసుకున్న తొలి తెలుగు రచయిత ఆయన మాత్రమే అని అంటుంటారు. పంచ్ డైలాగులు, ప్రాస డైలాగులు మాత్రమే కాదు.... జీవిత సత్యాలను ఆకట్టుకునేలా డైలాగుల రూపంలోకి మార్చి ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయడం ఆయనకే చెల్లింది. నేడు త్రివిక్రమ్ పుట్టినరోజు.
డియర్ ఫ్రెండ్ అంటూ ట్వీట్ చేసిన మహేష్ బాబు
తెలుగు సినిమా ఇండస్ట్రీలో త్రివిక్రమ్కు అత్యంత సన్నిహితంగా ఉండే స్టార్ హీరోల్లో మహేష్ బాబు ఒకరు. త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు ట్వీట్ చేశారు. ‘మై డియర్ ఫ్రెండ్' అని సంభోదిస్తూ మహేష్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

త్రివిక్రమ్తో త్వరలో మహేష్ బాబు మూవీ
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. త్వరలో ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది. ప్రస్తుతం ఇద్దరూ వేరే వేరే సినిమా కమిట్మెంట్స్లో ఉండటంతో 2018 చివర్లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని టాక్.
వెల్లువెత్తిన అభిమానం
త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన అభిమానులు శుభాకాంక్షలతో ముంచెత్తారు. టాలీవుడ్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దర్శకుల్లో త్రివిక్రమ్ ఒకరు. హీరోతో సంబంధం లేకుండా ఆయన బ్రాండ్ నేమ్తోనే సినిమాకు ఓపెనింగ్స్ తెప్పించగల సత్తా ఉన్న దర్శకుడు.

భీమవరం బుల్లోడు
త్రివిక్రమ్ శ్రీనివాస్ పూర్తి పేరు ఆకెళ్ల నాగ శ్రీనివాస్. స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం. 1971 నవంబర్ 7న జన్మించారు. ప్రస్తుతం ఆయన వయసు 44. త్రివిక్రమ్ చదువంతా భీమవరంలోనే సాగింది. న్యూక్లియర్ ఫిజిక్స్లో మాస్టర్స్ చేశారు. అంతేకాదు గోల్డ్మెడలిస్ట్ కూడా. కొంతకాలం ఉపాధ్యాయుడిగా కూడా పనిచేశారు.

సినిమా రంగంలోకి
సాహిత్యంపై ఉన్న అభిరుచే త్రివిక్రమ్ను సినీ ఫీల్డ్ వైపు అడుగులు వేయించింది. రచయితగా ఇక్కడ ఆయన ప్రయాణం మొదలైంది. అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

సునీల్, పోసానిలతో
హైదరాబాద్ వచ్చిన కొత్తలో సునీల్తో కలిసి ఒకే రూమ్లో ఉన్నారు త్రివిక్రమ్. ఇద్దరూ ఒకే ఊరి వారు కావడంతో మంచి ఫ్రెండ్స్ అయ్యారు. కొంతకాలం త్రివిక్రమ్ అప్పట్లో ప్రముఖ రచయితగా తన హవా కనసాగిస్తున్న పోసాని కృష్ణమురళి వద్ద సహాయకుడిగా పనిచేశారు.

సినీ రచయితగా
త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా పని చేసిన తొలి చిత్రం ‘స్వయంవరం'. తొలి చిత్రంతో మంచి పేరు రావడంతో ‘నువ్వేకావాలి', ‘చిరునవ్వుతో..', ‘నిన్నే ప్రేమిస్తా', ‘నువ్వునాకు నచ్చావ్', చిత్రాలకు డైలాగ్స్ రాశారు. ఈ చిత్రాల తర్వాత ‘నువ్వే నువ్వే' సినిమా ద్వారా దర్శకుడిగా మారారు. ఈ సినిమా మంచి విజయం సాధించినా....ఎందుకనో మరో మూడేళ్ల వరకు దర్వకుడిగా అవకాశం రాలేదు. ఈ గ్యాపులో ఆయన వాసు, నమ్మథుడు, ఒక రాజు ఒక రాణి, మళ్లీశ్వరి, జై చిరంజీవ చిత్రాలకు రచయితగా పని చేసారు. చిరు నవ్వుతో చిత్రానికి బెస్ట్ డైలాగ్ రైటర్ గా నంది అవార్డ్ అందుకున్నారు.

బయటి చిత్రాలకు మాటలు రాయడం మానేశారు
‘అతడు' సినమా సమయం నుండే త్రివిక్రమ్ బయటి చిత్రాలకు మాటలు రాయడం మానేసారు. అయితే మధ్యలో పవన్ కళ్యణ్ తీన్మార్ చిత్రం కోసం డైలాగులు రాసారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో అతడు తర్వాత జల్సా, ఖలేజా, జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అ..ఆ సినిమాలు వచ్చాయి. ఇందులో ఖలేజా మినహా మిగతా చిత్రాలన్నీ మంచి విజయం సాధించాయి.


Click it and Unblock the Notifications











