మజిలీ వివాదం.. సంగీత దర్శకుడిపై ఫిర్యాదు.. తమన్కి కూడా డబ్బు!
నాగ చైతన్య, సమంత జంటగా నటించిన మజిలీ చిత్రం గత శుక్రవారం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన మజిలీ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. పాజిటివ్ టాక్ తో మజిలీ నాగచైతన్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్ల దిశగా దుసుకుపోతోంది. మజిలీ చిత్రంతో నాగ చైతన్య చాలా రోజుల తర్వాత మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా సరిగ్గా విడుదలకు కొన్ని రోజుల ముందు సంగీత దర్శకుడి విషయంలో కాస్త గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. మజిలీ చిత్రం ద్వారా గోపి సుందర్ చిక్కుల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్గా
గోపి సుందర్ ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. గత ఏడాది ఘన విజయంగా నిలిచింది గీత గోవిందం చిత్రానికి గోపి సుందరే సంగీత దర్శకుడు. తెలుగులోనే కాక మలయాళంలో కూడా గోపిసుందర్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్. శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన నిన్ను కోరి చిత్రానికి ఇతడే సంగీతం అందించాడు. ఆ చిత్రం విజయం సాధించడంతో శివ నిర్వాణ మజిలీ చిత్రానికి కూడా అతడినే ఎంపిక చేసుకున్నాడు.

పూర్తి చేయకుండా
మజిలీ చిత్రానికి గోపి సుందర్ మంచి ఆల్బమ్ అందించాడు. మజిలీ చిత్రంలోని కొన్ని పాటలు బాగా ఆకట్టుకున్నాయి. మరి కొన్ని రోజుల్లో మజిలీ చిత్రం విడుదలవుతుంది అనగా గోపిసుందర్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు. దీనితో ఇక చేసేది లేక చిత్ర యూనిట్ తమన్ ని రంగంలోకి దించి బ్యాగ్రౌండ్ సంగీతం పూర్తి చేయించింది. గోపి సుందర్ వ్యక్తిగత కారణాల వల్ల ఈ చిత్రం నుంచి తప్పుకునట్లు తెలుస్తోంది. నిర్మాతలు బ్యాగ్రౌండ్ సంగీతం పూర్తి చేయమని అడగగా మరికొంత సమయం కావాలని చెప్పాడట.

తమన్కి కూడా
మరికొన్ని రోజుల్లో మజిలీ చిత్రం విడుదల కావాల్సి ఉండగా గోపి సుందర్ వైఖరితో సినిమా ఎక్కడ వాయిదా అపడుతుందో అని నిర్మాతలు భయపడ్డారు. గోపి సుందర్ ఎంతకీ బ్యాగ్రౌండ్ సంగీతం పూర్తి చేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నిర్మాతలు తమన్ తో ఆ పని పూర్తి చేయించారు. తమన్ కు కొంత మొత్తం పారితోషికంగా అందించినట్లు తెలుస్తోంది.

గోపి సుందర్పై ఫిర్యాదు
గోపి సుందర్ విషయంలో జరిగిన విషయాలు విడుదలకు ముందు బయటకు వస్తే సినిమాపై ప్రభావం చూపుతుందని సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు మజిలీ మంచి సక్సెస్ సాధించింది. దీనితో నిర్మాతలు గోపి సుందర్ పై ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలుస్తోంది. గోపి సుందర్ కి పారితోషికం కూడా చెల్లించాం. నేపథ్య సంగీతం అందించినందుకు తమన్ కు కూడా కొత్త మొత్తం ఇవ్వాల్సి వచ్చింది. గోపి సుందర్ వల్ల తాము నష్టపోయామని నిర్మాతలు ఫిలిం ఛాంబర్ ని ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











