ఇండస్ట్రీ అంటే ఆ నలుగురు కాదు.. అందుకే ఈ కష్టాలు.. Mohan Babu లేఖ కలకలం
ఏపీలో టికెట్ల అంశం మీద ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాస్తారనుకున్న మంచు మోహన్ బాబు రివర్స్ లో సినీ పరిశ్రమలోని వారికే బహిరంగ లేఖ రాసి కలకలం రేపారు. అందులో ఆయన అనేక అంశాలను ప్రస్తావించారు. ఆ వివరాల్లోకి వెళితే

దానికి సమాధానమే ఇది
''మంచు మోహన్ బాబు రాసిన లేఖ యధాతంగా ''మనకెందుకు మనకెందుకు అని మౌనంగా వుండాలా, నా మౌనం చేతకానితనం కాదు.. చేవలేని తనం కాదు..కొంతమంది శ్రేయోభిలాషులు వద్దని వారించారు. నీ మాటలు నిక్కచ్చిగా వుంటాయ్.. కఠినంగా ఉంటాయి.... కానీ నిజాలే వుంటాయ్. ఇతరులను ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇది నీకు అవసరమా అన్నారు. అంటే వాళ్ళు చెప్పినట్టు బతకాలా.... నాకు నచ్చినట్టు బతకాలా... అనే ప్రశ్న ఎదురైంది. దానికి సమాధానమే ఇది'' అని ఆయన పేర్కొన్నారు.
సినిమా ఇండస్ట్రీ అంటే నలుగురు కాదు
''సినిమా ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్స్, నలుగురు డిస్ట్రిబ్యూటర్స్ కాదు. కొన్ని వేలమంది ఆశలు, కొన్ని వేల కుటుంబాలు... కొన్ని వేల జీవితాలు. 47 సంవత్సరాల అనుభవంతో చెప్తున్న మాట. అందరి జీవితాలతో ముడిపడిన ఈ సినిమా ఇండస్ట్రీ గురించి మనకు ఉన్న సమస్యల గురించి ముఖ్యమంత్రులకు వివరించాలనుకుంటే అందరూ కలిసి ఒకచోట సమావేశమై సమస్యలు ఏంటి?, పరిష్కారాలు ఏంటి?.. ఏది చేస్తే సినీ పరిశ్రమకి మనుగడ ఉంటుంది అని చర్చించుకోవాలి'' అని ఆయన పేర్కొన్నారు.

ఇన్ని కష్టాలు వచ్చుండేవి కావు
''ఆ తర్వాత మాత్రమే సినిమాటోగ్రఫీ మంత్రుల్ని, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసికట్టుగా కలవాలి. అలా కాకుండా నలుగుర్నే రమ్మన్నారు. ప్రొడ్యూసర్స్ నుంచి నలుగురు, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఓ ముగ్గురు, హీరోల నుంచి ఇద్దరు, ఏంటిది..! మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సినిమా పరిశ్రమలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు.. అందరూ సమానం.. ఏ ఒక్కరి గుత్తాధిపత్యం కాదు. చిన్న నిర్మాతల్ని కూడా కలుపుకుని ముఖ్యమంత్రుల దగ్గరకు వెళ్ళి. సమస్యల్ని వివరిస్తే మనకీరోజు ఇన్ని కష్టాలు వచ్చుండేవి కావు'' అని ఆయన పేర్కొన్నారు.

బిక్ష పెట్టండి
''సినీ పరిశ్రమలో ఒక పార్టీ వాళ్ళు ఉండొచ్చు. లేదా వేరు వేరు పార్టీల వాళ్ళు ఉండొచ్చు అది వాళ్ళ ఇష్టం, కాదనను. కానీ ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రుల్ని ముందుగా మనం కలవాలి.. వాళ్ళని మనం గౌరవించుకోవాలి... మన కష్టసుఖాలు చెప్పుకోవాలి..! అలా జరిగిందా? జరగలేదు. నేను 'మా' అధ్యక్షుడిగా ఉన్న టైంలో సినీ పరిశ్రమలో ఉన్న ప్రముఖలందర్ని కలుపుకొని ఒక్కటిగా వెళ్లి అప్పటి సి.ఎం. డా॥ రాజశేఖర్ రెడ్డి గారిని కలిసి పైరసీ కోరల్లో సినిమా నలిగిపోతుంది, మా మీద దయ చూపి బిక్ష పెట్టండి అనగానే, ఆ మాట చాలా మందికి నచ్చలేదు'' అని ఆయన పేర్కొన్నారు.

న్యాయం చేయమని అడుగుదాం
''కానీ రాజశేఖర్ రెడ్డి గారిని కదిలించింది. చాలావరకు పైరసీని కట్టడి చేసింది. సినిమా ఇండస్ట్రీకి ఉపయోగపడే పనులు చాలా వరకు చేసిపెట్టింది అప్పటి ప్రభుత్వం. 350 రూపాయలు, 300 రూపాయల టికెట్లు రేట్లతో చిన్న సినిమాలు నిలబడడం కష్టం. 50 రూపాయలు, 30 రూపాయలు టికెట్ల రేట్లతో పెద్ద సినిమాలు నిలబడడం కష్టం. చిన్న సినిమాలు ఆడాలి.. పెద్ద సినిమాలు ఆడాలి.. దానికి సరైన ధరలుండాలి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి 'అయ్యా.. మా సినీ రంగం పరిస్థితి ఇది., చిన్న సినిమాల్ని పెద్ద సినిమాల్ని దృష్టిలో పెట్టుకుని మనకి న్యాయం చేయమని అడుగుదాం'' అని ఆయన పేర్కొన్నారు.
Recommended Video

ఆ నిర్మాతలు ఏమయ్యారు?
''సినిమా పరిశ్రమలో 24 క్రాఫ్ట్స్ వున్నాయి.. మా అందరికీ దేవుళ్ళు నిర్మాతలు... కానీ ఈ రోజున ఆ నిర్మాతలు ఏమయ్యారు? అసలు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సమస్యను భుజాల మీద వేసుకోకుండా ఎవరికి వారే యమునాతీరే అన్నట్టు ఎందుకు మౌనం వహిస్తుందో అర్థం కావట్లేదు. మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఒక్కటిగా ఉంటేనే సినిమా బ్రతుకుతుంది.. రండి అందరం కలిసి సినిమాని బతికిద్దాం'' అని ఆయన పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











