మీకు బాధ్యత ఉంటే అలా రాయొద్దు: రివ్యూ రైటర్లపై మంచు విష్ణు
రివ్యూ రైటర్లపై మంచు విష్ణు ఫైర్ అయ్యారు. సినిమా సరిగా చూసి రాయండి అని సూచించారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కామెంట్లతో సినిమా రివ్యూలపై మొదలైన వివాదం టాలీవుడ్లో పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఇటీవల 'జై లవ కుశ' ప్రెస్ మీట్లో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ అందరినీ విస్తుపోయేలా చేశాయి. రివ్యూ రైటర్లను ఎమర్జెన్సీ వార్డులోనే సినిమాను చంపేస్తున్న దానయ్యలుగా అభివర్ణించిన సంగతి తెలిసిందే.
ఈ వివాదంపై పలువురు ప్రముఖులు స్పందించారు. తమ్మారెడ్డి భరద్వాజ, కత్తి మహేష్ లాంటి వారు ఎన్టీఆర్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. మహేష్ బాబు స్పందిస్తూ.... నేను కూడా రివ్యూస్ చదువుతున్నాను. సినిమా బాగుంటే బాగా రాస్తున్నారు, బాగుండకపోతే బాగా రాయట్లేదు. సింపుల్ సింపుల్ లాజిక్. ఇంతకన్నా వివరించి నేను చెప్పలేను, దీనిపై వివాదాలు ఎందుకు వస్తున్నాయో తెలియడం లేదన్నారు.

మంచు విష్ణు కామెంట్
తాజాగా రివ్యూల వివాదంపై మంచు విష్ణు స్పందించారు. అసలు సినిమాను సరిగా చూడకుండానే రివ్యూలు రాస్తున్నారని అన్నాడు. ఓ వైపు సినిమా చూస్తూ లైవ్ అప్డేట్స్ ఇస్తున్నారు. ఏకాగ్రతతో సినిమా చూడకుండా మంచి రివ్యూలు ఎలా వస్తాయంటూ మంచు విష్ణు ప్రశ్నించారు.

మీకు బాధ్యత ఉంటే సరిగా చూడండి
ఒక సినిమా గురించి ప్రేక్షకులకు మంచి రివ్యూ, జెన్యూన్ రివ్యూ అందించాలనే బాధ్యత రివ్యూ రైటర్లకు ఉంటే.... ముందు సినిమా చూస్తూ అప్డేట్స్ ఇవ్వడం మాని, సినిమాను ఏకాగ్రతతో చూడండి. ఆ తర్వాత రివ్యూలు రాయండి అంటూ మంచు విష్ణు సూచించారు.

మంచు విష్ణు చెప్పింది ఆలోచించాల్సిన విషయమే
ఈ మధ్య కొందరు రివ్యూ రైటర్లు లైవ్ అప్డేట్స్ పేరుతో సినిమా చూస్తూ...... పాట మొదలైంది, ఫైట్ జరుగుతోంది, ఇక్కడ కామెడీ బిట్ ఇలా ఇలా సాగింది అంటూ సినిమా చూస్తూనే అప్డేట్స్ ఇస్తున్నారు. అంటే సగం మనసు సినిమాపై, సగం మనసు సినిమా అప్డేట్స్ ఇవ్వడంపై పెడుతున్నారు. ఇలా చేస్తే సినిమాపై ఏకాగ్రత సరిగా ఉండదు. మంచు విష్ణు చెప్పింది కూడా ఆలోచించాల్సిన విషయమే.

మంచు విష్ణు
మంచు విష్ణు సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఆయన ఆచారి అమెరికా యాత్ర సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











