బాలయ్య వారిని అవమానించినట్లా?...సినిమాను సినిమాలా చూడాలి: మంచు విష్ణు
హైదరాబాద్: బాలకృష్ణ గారు సమరసింహారెడ్డి సినిమా చేసారు.... దానర్ధం రెడ్లంతా ఫ్యాక్షనిస్టులనా? మోహన్ బాబుగారు రాయలసీమ రామన్న చౌదరి సినిమా చేసారు... అంటే అది చౌదరి సామాజిక వర్గాన్ని ఉద్దేశించి తీసిందా? సినిమాను సినిమాలా చూడాలి.... అంటూ వ్యాఖ్యానించారు మంచు విష్ణు.
మోహన్ బాబుకు కొందరు పిండ ప్రధానం చేయడంపై గురువారం ఆయన నాంపల్లి కోర్టులో ప్రైవేట్ పిటీషన్ దాఖలు చేసారు. ఈ సందర్భంగా ఓ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ... పై వ్యాఖ్యలు చేసారు. తాము అన్ని వర్గాల వారిని గౌరవిస్తామని, ఎవరినీ అవమానించే ఉద్దేశ్యం తమకు లేదని స్పష్టం చేసారు.
బ్రతికుండగానే తన తండ్రికి పిండ ప్రధానం చేయడాన్ని ఆయన నీచమైన చర్యగా పేర్కొన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే, అందుకే కోర్టుకెక్కినట్లు వెల్లడించారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, అలాంటప్పుడు ఎవరికీ భయ పడాల్సిన అవసరం లేదని మా నాన్న చెప్పారని విష్ణు వెల్లడించారు.
కోర్టులో కేసులు నడుస్తున్నందున బ్రాహ్మణులతో ఏర్పిడిన వివాదంపై ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదని చెప్పిన విష్ణు.... వివాదాలు కావాలని తెచ్చుకోమని, అనుకోకుండా జరుగుతాయని, ఎలాంటి వివాదం అయినా సినిమా వారికి ప్లస్సవుతాయని, ఫ్రీ పబ్లిసిటీ గా ఉపయోగపడతాయని వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











