‘ఈగ’ పైరసీ కేసులో మనోజ్ కుమార్ అరెస్టు
రాజమౌళి దర్శకత్వం వచ్చిన 'ఈగ' చిత్రాన్ని పైరసీ చేస్తూ మనోజ్ కుమార్ అనే వ్యక్తి పోలీసులకు చిక్కాడు. బెంగుళూరు కేంద్రంగా పైరసీ రాకెట్ నడిపిస్తున్న మనోజ్ ఇప్పటి వరకు 370 కొత్త సినిమాలు పైరసీ చేశాడు. అతని కోసం కొంత కాలంగా గాలిస్తున్న సీఐడి పోలీసులు పథకం ప్రకారం హైదరాబాద్లో అతన్ని పట్టుకున్నారు.
మనోజ్ చేసిన పైరసీ విలువ కోట్లలో ఉంటుందని అంచనా. మనోజ్ను విచారిస్తున్న పోలీసులు సినిమాలను పైరసీ ఎలా చేస్తున్నారు. మీకు సహకరిస్తున్న థియేటర్ల యజమానులు, సిబ్బంది ఎవరైనా ఉన్నారా? లేక రహస్యంగా చిత్రీకరించి పైరసీ చేస్తున్నారా? లేక ఇంటర్నెట్ ఆధారంగా చేస్తున్నారా? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.
ఈగ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన నేపథ్యంలో పైరసీ సీడీలకు భాగా డిమాండ్ ఉండటంతో భారీ మొత్తంలో వాటిని హైదరాబాద్లో విక్రయించేందుకు ప్రయత్నించారు. మనోజ్తో పాటు ఈ రాకెట్లో ఎవరెవరు ఉన్నారు? అనే దానిపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.
నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈగ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించగా సాయి కొర్రపాటి వారాహి చలనచిత్రం పతాకంపై ఈచిత్రాన్ని నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు ఈచిత్రానికి సమర్పకులు. ఈచిత్రంలో సుదీప్ నటనకు , రాజమౌళి దర్శకత్వానికి, విజువల్ ఎఫెక్ట్స్కి మంచి మార్కులు పడ్డాయి.


Click it and Unblock the Notifications











