సినీ పరిశ్రమలో మీడియేటర్స్, కోఆర్డినేటర్స్ వ్యవస్థ రద్దుచేస్తున్నాం: తలసాని
తెలుగు సినిమా పరిశ్రమలో మీడియేటర్స్, కోఆర్డినేటర్స్ వ్యవస్థను రద్దు చేయనున్నట్లు తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో కొన్నిరోజులుగా జరుగుతున్న కాస్టింగ్ కౌచ్, ఇతర సమస్యలపై సినీ పరిశ్రమలోని పెద్దలు, 'మా' ప్రతినిధులతో ఆయన చర్చించారు.
అనంతరం తలసానిమాట్లాడుతూ...''75 సంవత్సరాల ఇండస్ట్రీ మనది. ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలు బాధించాయి. ఈ పరిణామాలకు ఇక పులిస్టాప్ పడాల్సిన సమయం వచ్చింది. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు, మీడియా ఈ వివాదాన్ని ఇప్పటితో ఆపాలని తెలిపారు.

ఇలాంటి ఘటనలు భవిష్యత్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని సినీ పెద్దలు చెప్పారు. చలనచిత్ర అభివృద్ధి సంస్థ ద్వారా నటులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయించాం. ఇండస్ట్రీలో మీడియేటర్స్, కోఆర్డినేటర్స్ లేకుండా చూస్తాము, నటీనటుల పారితోషికం నేరుగా ప్రొడక్షన్ డిపార్టుమెంటు ద్వారా వారికే అందేలా చేస్తాము అని తలసాని అన్నారు.
ఫిర్యాదుల కోసం ఎఫ్డీసీలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని చెప్పిన తలసాని మహిళలు, నటులు ఏమైనా సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలి. చట్టపరంగా షీటీమ్స్కు ఫిర్యాదు చేయవచ్చు. మహిళలకు రక్షణ, వారికి జరిగే మోసాలపై ప్రభుత్వం కఠినంగా ఉంటుంది అని తలసాని తెలిపారు.
షూటింగ్ ప్రదేశాల్లో మహిళలకు సరైన సౌకర్యాలు కల్పించేలా నిబంధనలు అమలులోకి తెస్తామని తలసాని తెలిపారు. ఈ సమావేశంలో 'మా'అధ్యక్షుడు శివాజీ రాజా, జీవితా రాజశేఖర్, తమ్మారెడ్డి భరద్వాజ, సి.కల్యాణ్, పరుచూరి వెంకటేశ్వరరావు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











