తనదైన అద్బుత నటనతో తెలుగు,తమిళ,మళయాళి భాషల వారిని అలరిస్తున్నమీరాజాస్మిన్ కేరళ రాష్ట్రం ఉత్తమనటి అవార్డుకు ఎంపిక అయ్యింది. 28వ వార్షిక ఫిలిం అవార్డులను కేరళ రాష్ట్ర సాంస్కృతిక శాఖామాత్యులు తిరువనంతపురంలో ప్రకటించారు. ఒరు కాదల్ అనే మలయాళీ సినిమాలో ఉత్తమ నటనను ప్రదర్శించిన ఆమె ఈ అవార్డుకు ఎంపిక అయ్యింది. అలాగే పరదేశి అనే సినిమాలో ఉత్తమ నటనను ప్రదర్శించినందుకు మోహన్లాల్ను ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపిక చేశారు. ఉత్తమ దర్శకుని అవార్డు అడయలంగల్ అనే సినిమాకు దర్శకత్వం వహించిన ఎం.జి.శశికి దక్కింది. ఇక ద్వితీయ ఉత్తమనటులుగా మురళి, లక్ష్మి గోపాలస్వామిలను ఎంపిక చేసారు. ద్వితీయ ఉత్తమ చిత్రంగా ఒరు కాదల్ ఎంపికయ్యింది. ఉత్తమ కథాచిత్రంగా పరదేశి ఎంపికయ్యింది. మరో సారి మీరాజాస్మిన్ ఉత్తమనటి అవార్డుకు ఎంపిక అవటంతో ఆమె అభిమానులు ఆనందోత్సాహాలతో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆమె రాజశేఖర్ హీరోగా చేస్తున్నకన్నడ రీమేక్ గోరింటాకు చిత్రంలో చేస్తోంది.