సీఎం కేసీఆర్తో చిరంజీవి, నాగార్జున భేటి.. 2 వేల ఎకరాలతో ఫిలిం సిటీ ప్రతిపాదన
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున కలువడం చర్చనీయాంశమైంది. సినిమా పరిశ్రమకు సంబంధం లేకుండా ఇద్దరే ఎందుకు కలిశారనే విషయం ప్రత్యేకంగా మారింది. అయితే శనివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో చిరంజీవి, నాగార్జునతో సుదీర్ఘంగా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, రామకృష్ణ రావు, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. ఈ భేటిలో పలు విషయాలు చర్చలకు వచ్చాయని, ముఖ్యంగా సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన విషయాలు వారి సమావేశంలో వెలుగు చూశాయి. ఆ వివారాల్లోకి వెళ్లితే..

హైదరాబాద్ నగర శివారులో
హైదరాబాద్ నగర శివార్లలో అంతర్జాతీయ స్థాయిలో ఫిలిం సిటీ నిర్మిస్తాం. దాని కోసం 1500 నుంచి 2000 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తాం. ఫిలిం సిటీ నిర్మాణానికి ముందు సినీ ప్రముఖులు, అధికారుల బృందం బల్గేరియా వెళ్లి అక్కడి ఫిలిం సిటీని పరిశీలించి రావాలని, సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించాం. అన్లాక్ ప్రక్రియ ప్రారంభమయినందున సినిమా షూటింగులు, సినిమా థియేటర్లు పునఃప్రారంభించవచ్చు అని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

రోజువారీ వేతన కార్మికులను ఆదుకొందాం
తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు 10 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ వల్ల షూటింగులు ఆగిపోయి, ఇటు థియేటర్లు నడవక అనేక మంది ఉపాధి కోల్పోయారు. అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మళ్లీ మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయి. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 91.88 శాతం ఉంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ షూటింగులు పునఃప్రారంభించాలి. థియేటర్లు కూడా ఓపెన్ చేయాలి. తద్వారా చిత్ర పరిశ్రమపై ఆధారపడి బతికే కుటుంబాలను కష్టాల నుంచి బయట పడేయాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.

సీఎం కేసీఆర్తో చిరంజీవి, నాగార్జున
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతో షూటింగులు ప్రారంభించాం, త్వరలోనే థియేటర్లు కూడా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం అని చిరంజీవి, నాగార్జున చెప్పారు. హైదరాబాద్లో సినీ పరిశ్రమ అభివృద్ధి, విస్తరణకు పుష్కలమైన అవకాశాలున్నాయి. హైదరాబాద్ నగరం కాస్మో పాలిటన్ సిటీ. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు, వివిధ భాషలకు చెందిన వారు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఎవరినైనా ఒడిలో చేర్చుకునే గుణం ఉంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

2000 వేల ఎకరాల్లో ఫిలిం సిటీ
షూటింగులతో సహా సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని ప్రక్రియలను చాలా సౌకర్యవంతంగా నిర్వహించుకునే వీలుంది. ప్రస్తుత నెలకొన్న పరిస్థితులకు తోడు ప్రభుత్వం సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్ నిర్మించాలనే తలంపుతో ఉంది. ప్రభుత్వం 1500 నుంచి 2000 ఎకరాల స్థలాన్ని సేకరించి ఇస్తుంది. అందులో అధునాతన సాంకేతిక నైపుణ్యంతో, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు అంతర్జాతీయ స్థాయిలో స్టూడియోలు నిర్మించుకునేందుకు సినిమా నిర్మాణ సంస్థలకు స్థలం కేటాయిస్తుంది. ఎయిర్ స్ట్రిప్తో పాటు అన్ని రకాల మౌళిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది అనే భరోసాను ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.


Click it and Unblock the Notifications











