Pawan Kalyan ప్రతీ మాట కరెక్ట్.. ప్రతీ అడుగు న్యాయం కోసమే.. విమర్శలకు చెక్ పెట్టిన చిరంజీవి
తెలుగు సినిమా పరిశ్రమకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ప్రతిష్టంభనను తొలగించేందుకు మెగాస్టార్ చిరంజీవి తీసుకొన్న చొరవపై ఓ వర్గం సానుకూలంగా స్పందిస్తే.. మరో వర్గం ప్రతికూలమైన వాదనలను తెరపైకి తెచ్చింది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా చిరంజీవి మాట్లాడిన ప్రసంగం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆ వివరాల్లోకి వెళితే...

రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో
తెలుగు సినిమా పరిశ్రమపై ఏపీ ప్రభుత్వం అవలంభించిన విధానాలపై రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం లేపాయి. ఆ స్పీచ్ తర్వాత పవన్ కల్యాణ్పై ఏపీ మంత్రులు ఒంటికాలిపై లేచారు. పవన్ కల్యాణ్ను టార్గెట్ చేసుకొని నానా రకాలుగా కామెంట్లు చేశారు.

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం
అయితే పవన్ కల్యాణ్కు ఏపీ ప్రభుత్వం మధ్య వ్యవహారం ఉప్పు, నిప్పు మాదిరిగా తయారైన నేపథ్యంలో వైఎస్ జగన్తో చిరంజీవి జరిపిన లంచ్ రాయబారంపై భిన్న స్వరాలు వినిపించాయి. పవన్ కల్యాణ్ వైపు ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతుంటే.. చిరంజీవి చర్చలు జరపడం ఏమిటనే వాదనలు తెరపైకి వచ్చాయి. కానీ అలాంటి వాదనలు పక్కన పెట్టి.. సినిమా పరిశ్రమ బాగు కోసం అనేక అవమానాలు మెగాస్టార్ ఎదుర్కొన్నారు. చివరకు ప్రభుత్వంపై సానుకూల స్పందనను రాబట్టారు. ఇలాంటి సమయంలోనే కొందరు చిరంజీవిని సమర్ధిస్తూ.. పవన్ కల్యాణ్పై విమర్శలు చేస్తున్నారు.

పవన్ కల్యాణ్ ఆలోచన విధానం కరెక్ట్
అయితే తన తమ్ముడు పవన్ కల్యాణ్ వాదనపై చిరంజీవి భావోద్వేగంతో స్పందించారు. ఏదైనా ఒక విషయంపై పవన్ కల్యాణ్ స్పందిస్తే.. అది కరెక్ట్ అని నా హృదయం చెబుతుంది. తను మాట్లాడేది సబబు కదా.. ఆయన కూడా న్యాయం కోసం పోరాడుతున్నాడు కదా.. న్యాయం కోసమే బతుకుతున్నాడు కదా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఏదైతే పవన్ కల్యాణ్ మాట్లాడుతాడో.. అలాంటి విషయాలపై నేను కూడా సమయం తీసుకొని అదే విధంగా స్పందిస్తాను అని చిరంజీవి అన్నారు.

ఎవరి నుంచి ఒక్క మాట పడలేదు..
ఏదైనా సమస్యపై పోరాడటం కానీ.. దానికి పరిష్కారం కోసం మనం పాటించే సయమనం, నిజాయితీ, అంకితభావం విజయం సాధించేందుకు దోహదపడుతాయి. ఎప్పటికైనా నిజాయితీ, క్రమశిక్షణ, అంకితభావమే గెలుస్తుంది. నేను ఎప్పుడు ఎవరి నుంచి ఒక మాట కూడా పడలేదు. ఇక ముందు కూడా పడను. పవన్ కల్యాణ్ వేసే ప్రతి అడుగు కరెక్ట్. పవన్ కల్యాణ్ నా తమ్ముడు అయినందుకు గర్వపడుతాను అంటూ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.

సోషల్ మీడియాలో చిరంజీవి స్పీచ్ ట్రెండింగ్
ఇటీవల తన అభిమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో చిరంజీవి చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. పవన్ కల్యాణ్ గురించి తన అభిప్రాయాలను ఆ వేదిక వెల్లడించడం వైరల్గా మారాయి. మెగా, పవన్ అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ప్రస్తుతం చిరంజీవి మాట్లాడిన వీడియో యూట్యూబ్లో ట్రెండింగ్గా మారింది.

చిరంజీవిలో అసంతృప్తి అంటూ..
అయితే ఏపీ ప్రభుత్వంతో సినీ ప్రముఖులతో కలిసి చర్చలు జరిపిన అనంతరం చిరంజీవి అసంతృప్తితో ఉన్నారనే వార్తలు మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అలాంటిదేమీ లేదని కొందరు ఖండించారు. అయితే ఈ అసంతృప్తి విషయాన్ని పక్కన పెడితే.. పవన్ కల్యాణ్కు మద్దతుగా నిలుస్తూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఏపీ ప్రభుత్వంతో చర్చల తర్వాత కలిగిన అసంతృప్తికి పర్యవసానమే ఈ వ్యాఖ్యలకు కారణం అనే కొత్త వాదన తెరపైకి వచ్చింది. అయితే ఏది నిజం, ఏది అవాస్తవం త్వరలోనే తెలుస్తుంది.


Click it and Unblock the Notifications











