ఎప్పుడో రావాల్సింది మీకు.. సిరివెన్నెలతో చిరు.. క్యూకట్టిన టాలీవుడ్!
టాలీవుడ్ దిగ్గజ గేయ రచయితలలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఒకరు. ఎన్నో మధురమైన గీతాలు ఆయన కలం నుంచి జాలువారాయి. సిరివెన్నెల పాటలు మధురానుభూతిని కలిగించేలా ఉంటాయి. లోతైన భావంతో, అచ్చ తెలుగు పదాలతో పాటలు రాయడంలో సిరివెన్నెల ఆయనకు ఆయనే సాటి అనడంలో అతిశయోక్తిలేదు. ఎన్నో చిత్రాల్లో సిరివెన్నెల అందించిన పాటలు హైలైట్ గా నిలిచాయి. సిరివెన్నెల 80, 90 దశకాల్లో అందించిన పాటలు ఇప్పటికే అదే అనుభూతితో అలరిస్తూ ఉంటాయి. వందలాది చిత్రాలకు పాటలు అందించిన సిరివెన్నెల ఇటీవల భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపేందుకు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు సిరివెన్నెల నివాసానికి క్యూ కడుతున్నారు.

ఎప్పుడో రావాల్సింది మీకు
మెగాస్టార్ చిరంజీవి సిరివెన్నెలని అభినందించేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. సిరివెన్నెల చిరుని ఆప్యాయంగా స్వాగతించారు. పద్మశ్రీ పురస్కారం అందుకోబోతున్నందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ ఎప్పుడో రావాల్సింది మీకు ఆలస్యం జరిగింది అని తెలిపారు. మీరు వస్తున్నారని తెలియగానే మీ చిత్రాలకు రాసిన పాటలన్ని నా మదిలో మెదులుతున్నాయి అని సిరివెన్నెల చిరంజీవితో అన్నారు.

1986లో
సిరివెన్నెల సీతారామశాస్త్రి 1986లో గేయ రచయితగా తన కెరీర్ ని ప్రారంభించారు. దిగ్గజ సంగీత దర్శకులు కెవి మహదేవన్, ఇళయరాజా, చక్రవర్తి, కీరవాణి, రాజ్ కకోటి సంగీత సారధ్యంలో ఎన్ని అద్భుతమైన పాటలు అందించారు. ఇప్పటి యువ తరానికి తగ్గట్లుగా కూడా ఆయన పాటలు రాయడంలో దిట్ట. చిరంజీవి నటించిన రుద్రవీణ, దొంగ మొగుడు, వేట లాంటి చిత్రాలకు సిరివెన్నెల పాటలు రాశారు.

క్యూకట్టిన టాలీవుడ్
టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ప్రముఖులంతా సిరివెన్నెల శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన నివాసానికి క్యూకట్టారు. మా అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా, రచయిత సాయిమాధవ్ బుర్రా, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ సిరివెన్నెల నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. సిరివెన్నెల లాంటి రచయితలు తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణం అని వారంతా ప్రశంసలు కురిపించారు.

పద్మశ్రీ దక్కించుకుంది
2000 తర్వాత కూడా సిరివెన్నెల జోరు తగ్గలేదు. ఎమోషనల్ ప్రేమ జీతాలు, హుషారెత్తించే పాటలు, మెలోడీ సాంగ్స్ ఇలా అన్నిరకాల పాటలు రాస్తూ దూసుకుపోయారు. ఇప్పటికి సిరివెన్నెల పలు చిత్రాల్లో పాటలు రాస్తూ తన కలానికి పదును తగ్గలేదని నిరూపిస్తున్నారు. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి సిరివెన్నెల పద్మశ్రీ పురస్కారం రావడంపై సోషల్ మీడియాలో స్పందిస్తూ.. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి పేరుకి ముందు తనని పలికే అదృష్టాన్ని పద్మశ్రీ దక్కించుకుందని తెలిపారు.


Click it and Unblock the Notifications











