రాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి..జగన్ బంపర్ ఆఫర్.. కీలక వ్యాఖ్యలు చేసిన చిరంజీవి!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో మెగాస్టార్ చిరంజీవి సమావేశం అయ్యారన్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో సినిమా టికెట్ రేట్ల అంశం సహా అనేక విషయాలను, సినీ ఇండస్ట్రీ సమస్యలను సీఎం దృష్టికి చిరంజీవి తీసుకువెళ్ళారు. అయితే ఈ భేటీలో జగన్ ఆయనకు రాజ్యసభ టికెట్ ఆఫర్ చేశారని ప్రచారం మొదలైంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆ వివరాలు

జగన్, చిరంజీవి భేటీ
సుమారు గంట 20 నిమిషాల పాటు సీఎం జగన్, చిరంజీవి భేటీ జరిగింది. సమావేశం అనంతరం మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ మంచి వాతావరణంలో సమావేశం జరిగిందని, సీఎం జగన్తో సమావేశం సంతృప్తిని కలిగించిందని అన్నారు. సామాన్య ప్రజలకు వినోదం అందుబాటులో ఉండాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తున్నానన్న ఆయన సీఎం ప్రయత్నానికి అభినందనలు అని పేర్కొన్నారు.

కన్పించేంత గ్లామర్ ఫీల్డ్ కాదు
ఏదో మంచి చేయాలన్న ఆలోచన ప్రభుత్వం వైపు నుంచి ఉంది, నేను ఒక పక్షాన ఉండను, అందరినీ సమదృష్టితో చూస్తానని సీఎం జగన్ చెప్పారని, ఆయన భయపడొద్దని భరోసా ఇవ్వడంతో ఆయన మాటలు ధైర్యమిచ్చాయని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు. అలాగే సినీ ఇండస్ట్రీ బయటకు కన్పించేంత గ్లామర్ ఫీల్డ్ కాదని, రెక్కాడితేకాని డొక్కాడని కార్మికులు ఇండస్ట్రీలో ఉన్నారని అన్నారు. కరోనా సమయంలో సనీ కార్మికులు ఇబ్బందులు పడ్డారని అన్నారు.

మరోసారి భేటీ అవుతా
ఇక ఈ టికెట్ రేట్ల సమస్యకు త్వరలో పరిష్కారం లభిస్తుందని, సినీ ఇండస్ట్రీలో ఉన్నవారంతా ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వొద్దని ఆయన కోరారు. వారం పది రోజుల్లో ఏపీ ప్రభుత్వం నుంచి కొత్త జీవో వస్తుందని ఆశిస్తున్నానన్న మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో అందరూ సంయమనం పాటించండని ఆయన కోరారు. ఫిల్మ్ ఛాంబర్, ఎగ్జిబిటర్ల ప్రతినిథులను పిలిచి సీఎం మీటింగ్ పెడతామన్నారు, ఈ సమస్యకు ఫుల్స్టాప్ పడుతుందని ఆయన అన్నారు. తాను మరోసారి సీఎం జగన్తో భేటీ అవుతానని కూడా మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు.
చిరంజీవికి రాజ్యసభ సీటు
అయితే ఆయన ఒకందుకు వెళితే మరో ప్రచారం మొదలయింది. ఎక్కడ మొదలైందో ఎలా మొదలయిందో తెలియదు కానీ మెగాస్టార్ చిరంజీవికి వైసీపీ తరఫున జగన్ రాజ్యసభ సీటు ఆఫర్ చేశారని ప్రచారం మొదలైంది. త్వరలో ఖాళీ కాబోతున్న సీటులో చిరు రాజ్యసభలో ఎంటర్ అవనున్నారునై తెలిసింది. ఈ ప్రచారం నేపథ్యంలో చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

ప్రసారం చేయవద్దు
తెలుగు సినీ పరిశ్రమ మేలు కోసం, థియేటర్ల మనుగడ కోసం, ఆంధ్రప్రదేశ్ సి.ఎం వైఎస్ జగన్ గారిని కలిసి చర్చించిన విషయాలు పక్క దోవ పట్టించే విధంగా ఆ మీటింగ్ కి రాజకీయ రంగు పులిమి నన్ను రాజ్యసభకు పంపుతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి, అవన్నీ పూర్తిగా నిరాధారం అని ఆయన అన్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేను మళ్ళీ రాజకీయాల్లోకి , చట్ట సభలకు రావడం జరగదు, దయ చేసి ఊహాగానాలు వార్తలుగా ప్రసారం చేయవద్దు. ఈ వార్తలు, చర్చలు ఇప్పటితో పుల్ స్టాప్ పెట్టమని కోరుతున్నానని ఆయన పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











