పాటలతో అదరకొట్టిన బాలకృష్ణ
హైదరాబాద్: తుపాను బాధితుల సహాయార్థం తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఏర్పాటు చేసిన మేము సైతం కార్యక్రమంలో పాల్గొన్న సినీనటుడు బాలకృష్ణ పాటలతో హోరెత్తించారు. చలాకీ చూపులతో మత్తికించావే... అంటూ బాలకృష్ణ పాటపాడి ప్రేక్షకులను ఉత్సాహపరిచారు.
హుదు హుద్ తుపాను బాధితుల సహాయార్థం చిత్ర పరిశ్రమ ఏర్పాటు చేసిన మేము సైతం కార్యక్రమం హైదరాబాద్లో ప్రారంభమైంది. అనంత శ్రీరామ్ రచించి, సంగీత దర్శకుడు కోటి స్వరపరిచిన మేము సైతం... గీతాన్ని పలువురు గాయకులు ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు.
అలాగే...ప్రజలకు ఎప్పుడు కష్టం వచ్చినా తెలుగు చలనచిత్ర పరిశ్రమ అండగా ఉంటుందని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న దాసరి మాట్లాడుతూ... గతంలో విపత్తులు సంభవించినప్పుడు చిత్ర పరిశ్రమ ద్వారా అందించిన సాయం వివరాలను గుర్తు చేశారు. 1977 దివిసీమ ఉప్పెన సమయంలో, రాయలసీమ కరవు సమయంలో చిత్ర పరిశ్రమ పలుకార్యక్రమాలు ఏర్పాటు చేసి విరాళాలు సేకరించిందన్నారు.

తుపాను బాధితుల కోసం అప్పట్లో ఎన్టీఆర్ జోలెపట్టి విరాళాలు సేకరించారని గుర్తు చేశారు. సినీనటుడు నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ... తుపాను బాధితుల సహాయం కోసం కళాకారులు వ్యక్తిగతంగా విరాళాలు ఇచ్చినప్పటికీ, చిత్ర పరిశ్రమ ద్వారా అందరం కలిసి ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయని పి.సుశీల బాధితుల కోసం రూ.లక్ష విరాళాన్ని ప్రకటించారు.
కార్యక్రమంలో సినీ నటులు బాలకృష్ణ, మోహన్బాబు, నాగార్జున, వెంకటేష్, మురళీమోహన్, మంచు విష్ణు, దర్శకులు దాసరినారాయణరావు, రాఘవేంద్రరావు, నిర్మాత అల్లు అరవింద్, సురేష్బాబు తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











