కేవలం రామోజీరావు కోసం ఆస్కార్ రావాలని కోరుకొన్నా.. వివాదాస్పదంగా కీరవాణి వ్యాఖ్యలు
RRR చిత్రంలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును గెలుచుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా సంగీతాభిమానులు ఆనందంలో మునిగిపోయారు. నాటు నాటు పాటకు సంగీతం అందించిన కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్కు ఆస్కారు రావడంతో తెలుగు సినిమా పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. వారికి లభించిన అద్బుతమైన గౌరవానికి సూచకంగా తెలుగు సినిమా పరిశ్రమ సన్మానం చేపట్టింది. ఈ సన్మాన కార్యక్రమంలో కీరవాణి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఆ వ్యాఖ్యల వివరాల్లోకి వెళితే..
మేము ఉత్సవ విగ్రహాలం అంటూ : దేవాలయంలో మూల విగ్రహాలు ఉంటాయి.. అవి బయటకు రావు. ఉత్సవాల్లో ఊరేగించడానికి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ప్రేమ్ రక్షిత్ మూల విగ్రహాల లాంటి వాళ్లు. నేను చంద్రబోస్ ఉత్సవ విగ్రహాల్లాంటి వాళ్లం. వారి తరఫున అభినందనలు, పురస్కారాలు అందుకోవడానికి మేము బయటకు వచ్చాం. గోల్డెన్ గ్లోబ్ అందుకొన్నప్పుడు అదే విషయాన్ని చెప్పాను అని కీరవాణి అన్నారు.

ఇలాంటి పండుగలు మరిన్నీ : ఆస్కార్ విజేతలైనా మమ్మల్ని సన్మానించడానికి తెలుగు పరిశ్రమకు చెందిన వాళ్లంతా ఒక్కచోట చేరడం చాలా సంతోషంగా ఉంది. సందర్భాలు వేరుగా ఉంటాయి. వ్యక్తులు మారుతుంటారు. ఇట్లా అన్ని క్రాఫ్టుల వాళ్లు ఏదో ఒంకతో ఒకచోట కలువాలి. ఇలాంటి పండుగ చేసుకొనే వాతావరణాన్ని కల్పించాలని కోరుకొంటున్నాను అని కీరవాణి ఎమోషనల్ అయ్యారు.
కృష్ణంరాజు సోదరులకు థ్యాంక్స్ : నా మొట్టమొదటి పాటను రమేష్ ప్రసాద్ నిర్మించిన చెన్నైలో ప్రసాద్ 70ఎంఎం థియేటర్లో ఉన్నత సాంకేతిక విలువలతో రికార్డింగ్ చేశారు. దేవాలయంతో సమానమైన థియేటర్లో పాటను రికార్డ్ చేయడానికి అవకాశం ఇచ్చిన కృష్ణంరాజు, సూర్యనారాయణ రాజుకు థ్యాంక్స్. కొత్తవాడినని ఏదో మూలకు ఉండే థియేటర్లో రికార్డు చేయమని చెప్పలేదు. ఆ పాటను రికార్డు చేసినప్పుడు నేను అద్బుతమైన అనుభూతిని పొందాను అని కీరవాణి అన్నారు.

ఆస్కార్ అవార్డు అందుకొన్నప్పుడు : సాధారణంగా రసగుల్లా తిన్న తర్వాత మంచి టీ తాగిన దాని రుచి మనకు తెలియదు. నా మొదటి పాట రికార్డు చేసిన తర్వాత నేను పొందిన అనుభూతిని ఆస్కార్ అవార్డు అందుకొన్నప్పుడు కూడా రాలేదు. ప్రతి అనుభూతి ఒక్కో రకంగా ఉంటుంది. నేను అవార్డు అందుకొన్నప్పుడు ఎందుకు ఎమోషనల్ కాలేదు అని మా కార్తీకేయ భార్య అడిగితే.. నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగిరితే నిభిడాశ్చర్యంతో వీరే.. అనే పరిస్థితి పలుమార్లు.. నెత్తురు కక్కుతూ నేల రాలితే.. నిర్ధాక్షిణ్యంగా వారే అనే పరిస్థితిని జీవితంలో చూశాను. అందుకే నేను ఎమోషనల్ కాలేదు అని కీరవాణి అన్నారు.
కేవలం రామోజీరావు కోసమే అంటూ : ఆస్కార్ అవార్డుల కోసం వెళ్తున్నప్పుడు.. బతికితే ఒక్క రోజైనా రామోజీరావు లాగా బతకాలి అని నా భార్య ఒక మాట అన్నారు. మేము ఆస్కార్ అవార్డుల కోసం వెళ్తున్నామని రామోజీరావుకు చెబితే.. ఆస్కార్ అవార్డును ఇంటికి తీసుకురండి అంటే ఆశ్చర్యపోయాను. రామోజీ రావు ఆస్కార్కు ఇంత విలువ ఉందా? ఎలాగైనా దానిని తీసుకురావాలని అనుకొన్నాను. ఆస్కార్ ప్రకటించే చివరి నిమిషంలో రామోజీరావు కోసమైనా అవార్డు రావాలని కోరుకొన్నాను. ఒకసారి ఆస్కార్ వచ్చిన తర్వాత ఎవరెస్టు శిఖరం ఎక్కినంత ఆనందం కలిగింది అని కీరవాణి చెప్పారు.

నెటిజన్లు, సినీవర్గాలు అభ్యంతరం : ఆస్కార్ అవార్డు రావడానికి కృషి చేసిన రాజమౌళికి, ప్రేమ్ రక్షిత్, రాంచరణ్, ఎన్టీఆర్, ఉక్రెయిన్లో డ్యాన్స్ చేసిన ప్రతీ ఒక్కరికి నా ధన్యవాదాలు. పై మెట్టుకు ఎక్కడం వెనుక కింది మెట్లు ఎన్నో ఉంటాయి. ప్రతీ మెట్టుకు కృతజతభావంతో.. సమిష్టిగా లభించిన ఈ అవార్డుకు సమిష్టిగా ఈ వేడుకను నిర్వహించడానికి కృషి చేసిన ప్రతీ ఒక్కరికి నా అభినందనలు అని కీరవాణి అన్నారు. అయితే కేవలం రామోజీరావు కోసం ఆస్కార్ రావాలని కోరుకోవడంపై కొన్ని వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











