‘పద్మశ్రీ’ వాడుకోవద్దు, మోహన్ బాబుకు సుప్రీం షాక్!
హైదరాబాద్: సినీనటుడు మోహన్బాబుకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. పద్మశ్రీ బిరుదును ఎక్కడా వాడుకోవద్దని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది. ఇంటి ముందు, సినిమాల్లో పద్మశ్రీ బిరుదును ఉపయోగించవద్దని, ఎక్కడైన పద్మశ్రీ ఉంటే తొలగించాలని సుప్రీం సూచించింది. ఇంతకు ముందు ఈ పద్మశ్రీ వివాదం హైకోర్టులో విచారణ సాగింది. అయితే అవార్డులు తిరిగి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో మోహన్ బాబు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
మోహన్ బాబు 'పద్మశ్రీ' అవార్డును దుర్వినియోగం చేసారని, ఆ అవార్డును వెనక్కి తీసుకోవాలంటూ కోర్టులో వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బీజేపి నేత ఇంద్రసేనా రెడ్డి రాష్ర్ట హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయడంతో మోహన్ బాబు అవార్డు దుర్వినియోగం అయిన విషయం వెలుగులోకి వచ్చింది.

ఇంద్రసేనారెడ్డి ఫిర్యాదు వివరాలు...
బిజెపి సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి మోహన్ బాబుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తూ ఒక లేఖ పంపారు. మోహన్ బాబు తన లెటర్ పాడ్లలో , లేదా ఉత్తరప్రత్తురాలలో కేంద్ర ప్రభుత్వం 2007లో ప్రదానం చేసిన పద్మశ్రీ బిరుదును ప్రస్తావిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆయన నటించిన 'దేనికైనా రెడీ' చిత్రంలో కూడా మోహన్ బాబు పేరు ముందు పద్మశ్రీ అని వేసారు. పేరుకు ముందు లేదా తర్వాత పద్మశ్రీ బిరుదును ప్రస్తావించి ఇతర ప్రయోజనాలకు వాడుకోరాదని గతంలో సుప్రింకోర్టు తీర్పు ఇచ్చిందని, కాని మోహన్ బాబు అందుకు విరుద్దంగా చేస్తున్నారని ఇంద్రసేనారెడ్డి ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అందువల్ల మోహన్ బాబుకు ఇచ్చిన పద్మశ్రీ బిరుదును వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.


Click it and Unblock the Notifications











