Corona Effect: నా దగ్గరకు ఎవరూ రావొద్దు.. మోహన్ బాబు ఆత్మీయ విన్నపం
ప్రపంచాన్నే కంగారు పెడుతోంది కరోనా. ఈ వైరస్ విజృంభణకు బ్రేకులు పడక పోవడంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రభుత్వాలు, ప్రజలు అలర్ట్ అయ్యారు. భయాందోళనలకు గురవుతున్నప్పటికీ.. తగిన జాగ్రత్తలు తీకుంటున్నారు. ఇప్పటికే ఈ వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సూచనలిచ్చారు.
భారతదేశంలో కూడా కరోనా కోరలు చాస్తోంది. దీంతో కరోనా అరికట్టడంలో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రద్దీ ప్రదేశాల్లో తిరగకూడదని పేర్కొంటూ స్కూల్స్, కాలేజెస్, థియేటర్స్ లాంటి జనసమూహం ఉండే ప్రదేశాలపై ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో తాజాగా కరోనా పట్ల స్పందిస్తూ ఓ విన్నపం ప్రజల ముందుంచారు మోహన్ బాబు.
ఈ మేరకు మార్చి 19 (గురువారం) జరగాల్సిన తన జన్మదినోత్సవ వేడుకలను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. ప్రతి యేటా మార్చి 19వ తేదీన తన జన్మదినోత్సవంతో పాటు శ్రీ విద్యానికేతన్ వార్షికోత్సవాన్ని కూడా మోహన్ బాబు జరుపుతుంటారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ భయాందోళనల కారణంగా వాటిని వాయిదా వేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు.

తనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఎవరూ రావొద్దని, కరోనా వైరస్ ఈ భూమి నుంచి నిష్క్రమించే వరకు జాగ్రత్తలు తీసుకోవాలని మోహన్ బాబు సూచించారు. కరోనా వైరస్ గాలి కంటే వేగంగా ప్రయాణిస్తోందని, ప్రజలు గుంపులుగుంపులుగా ఉండడం మంచిది కాదని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికలను ఆయన గుర్తు చేశారు.


Click it and Unblock the Notifications











