మోహన్ బాబుకు బెదిరింపు కాల్స్.. ప్రాణ హాని ఉందంటూ కేసు నమోదు!
సినీ నటుడు మోహన్ గత కొంత కాలంగా వార్తలో హాట్ టాపిక్ గా మారుతున్నారు. మోహన్ బాబుకు సంబంధించిన ఏదో ఒక అంశం వార్తల్లో ఉంటోంది. మోహన్ బాబు తనకు ప్రాణ హాని ఉందంటూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 26నే మోహన్ బాబు తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అంటూ కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని తాజాగా బంజారాహిల్స్ పోలీసులు ధృవీకరించారు.
మార్చి 22న అర్థరాత్రి సమయంలో తనకు 30పైగా బెదిరింపు కాల్స్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చాయని మోహన్ బాబు ఫిర్యాదులో పేర్కొన్నారు. మోహన్ బాబు పీఏ ఫిర్యాదు లెటర్ ని పోలీస్ స్టేషన్ లో అందించినట్లు తెలుస్తోంది. న్యూజెర్సీ, సియోటెల్, పెన్సిల్వేనియా ప్రాంతాల నుంచి తనకు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు మోహన్ బాబు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని మోహన్ బాబు పోలీసులని కోరినట్లు తెలుస్తోంది.

ఈ ఫోన్ కాల్స్ ఎందుకు వచ్చాయి,ఎలాంటి బెదిరింపులకు పాల్పడ్డారు అనే వివరాలు మాత్రం ఫిర్యాదులో లేవు. ఇదిలా ఉండగా మంగళవారం రోజు ఎర్రమంజిల్ కోర్టు మోహన్ బాబుకు చెక్ బౌన్స్ కేసులో ఏడాదిపాటు జైలు శిక్ష, 41 లక్షల జరిమానా విధించింది. మోహన్ బాబు వెంటనే బెయిల్ పొందారు. ఈ కేసులో కోర్టుని తప్పుదోవ పట్టించారని మోహన్ బాబు స్పందించిన సంగతి తెలిసిందే. దీనిపై సెషన్స్ కోర్టులో న్యాయపరమైన పోరాటం చేస్తానని మోహన్ బాబు అన్నారు.


Click it and Unblock the Notifications











