Mohan Babu: బెదిరించారు.. అయినా భయపడకుండా గెలిపించారు.. మోహన్ బాబు టార్గెట్ చేసింది ఎవర్ని?
మా అధ్యక్షుడుగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేశారు. మంచు విష్ణుతో ప్రమాణస్వీకారాన్ని చేయించారు మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్. ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరు కాగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు మోహన్ బాబు. మంచు విష్ణు ప్రమాణ స్వీకారానికి మోహన్ బాబు, నరేష్, మా సభ్యులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

టాలెంట్ ఉంటేనే అవకాశాలు
మోహన్ బాబు మాట్లాడుతూ మా అనేది రాజకీయ వేదిక కాదు కళాకారుల వేదిక అని మనం రాజకీయాలకు దూరంగా ఉండాలని అన్నారు. అందరూ ఒకే తల్లి బిడ్డలమని, సీనియర్స్ కి నేను ఈ రోజుకి గౌరవం ఇస్తానని అన్నారు. మనం పెద్దలను గౌరవించాలని మోహన్ బాబు పేర్కొన్నారు. మనిషిలో టాలెంట్ ఉంటేనే అవకాశాలు వస్తాయని, 47 సంవత్సరాల నా నట జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశానని, అలాంటిది 'మా'లో రాజకీయాలు ఇలా కూడా ఉంటాయా అని ఆశ్చర్యం వేసిందని అన్నారు.

దయ, దాక్షిణ్యం
ఇక్కడ పేరు, గొప్పలు ముఖ్యం కాదన్న మోహన్ బాబు, విజయాలు, అపజయాలు సినిమా ఇండస్ట్రీలో కామన్ అని అన్నారు. 'మా' ఎన్నికల సమయంలో మేము బలంగా ఉన్నామని చాలా మంది బెదిరించారన్న ఆయన ఒకరి దయ, దాక్షిణ్యం సినిమా ఇండస్ట్రీలో ఉండదు...కేవలం టాలెంట్ ఉండాలని అన్నారు. ఈరోజు విష్ణును గెలిపించినందుకు కృతజ్ఞతలు అని ఆయన అన్నారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలనని ప్రశ్నించారు.

మీరు దేవుళ్ళు
నా కోపం నాకే నష్టం కలిగించిందన్న ఆయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే తప్పు పడతారు అన్నారు. మంచి మనుషులు, మంచి మనసులు నా బిడ్డను ఆశీర్వదించారని, ఇంకా గుళ్ళు ఎందుకు మీరు దేవుళ్ళని అంటూ ఆయన కొనియాడారు. ఇక ఓటు వేయని వారి మీద కక్ష వద్దు..నాకు రాగద్వేషాలు లేవని అన్నారు. నా బిడ్డను మీ చేతిలో పెడుతున్న...మంచి హీరో, మంచి నటుడని అన్నారు.

కలిసి మెలిసి పని చేద్దాం
భారత దేశంలోనే గొప్ప పేరు తీసుకువచ్చే విధంగా విష్ణు పని చేయాలని కోరిన ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కొత్త ప్యానెల్ మర్యాదపూర్వకంగా కలవాలని అన్నారు. కేసీఆర్ ను నేను కూడా కలిసి సహాయ , సహకారాలు కోరుతానని అన్నారు. కార్యక్రమంలో పాల్గొనకపోయినా అసోసియేషన్ మీదేనని ఎలాంటి బేధాలు ఇక్కడ లేవని అన్నారు. ఇక కలిసి మెలిసి పని చేద్దామని ఆయన అన్నారు.

నా మార్క్ నాకు ఉంది
ఇది విష్ణుకు పెద్ద బాధ్యత అని పేర్కొన్న మోహన్ బాబు, సమస్య ఉంటే మీలో మీరు చర్చించుకోండి..బహిర్గతం చేసుకోకండని అన్నారు. మీ టీం సైలెంట్ గా ఉండి.. అనుకున్నది సాధించాలని అభిలాషించారు. చిత్రపురి కాలనీ కోసం విషయంలో నేను కళాకారుల పక్షాన నిలిచానని, ఎవ్వరికీ గుర్తు ఉన్న లేకపోయినా...నా మార్క్ నాకు ఉంది...నేను చేసింది భగవంతునికి తెలుసని అన్నారు. కలిసిమెలిసి ఉందాం కలిసికట్టుగా సాధిద్దామని అన్నారు.

మేం ఇంత... అంతా అని అన్నారు
విష్ణు విజయానికి నరేష్ కీలకంగా వ్యవహరించాడన్న మోహన్ బాబు, షూటింగ్ లు క్యాన్సిల్ చేసుకుని మరీ విష్ణు గెలుపుకు సహకరించాడని అన్నారు. హాట్స్ ఆఫ్ టూ నరేష్...నిన్ను ఎప్పుడు మర్చిపోలేనని చెప్పుకొచ్చారు. సినిమాలు హిట్, ప్లాఫ్ అవుతుంటాయి. కానీ మేము అంతముంది ఉన్నాం, ఇంత మంది ఉన్నాం అని బెదిరించినా అదరక బెదరక ఓటు నా బిడ్డను గెలిపించారని ఆయన అన్నారు. నా జీవితం తెరిచిన పుస్తకం, రాజకీయం కంటే ఇక్కడ పాలిటిక్స్ ఎక్కువ అయ్యాయి.. ఇది అవసరమా ?, ఇక్కడ నువ్వు గొప్ప నేను గొప్ప కాదు.. జయాపజయాలు దేవుడి చేతిలో ఉంటాయని మోహన్ బాబు పేర్కొన్నారు. ఆయన ఎవరినీ పేరు పెట్టి విమర్శలు చేయకపోయినా మెగా ఫ్యామిలీని ఉద్దేశించే మాట్లాడారని కొందరు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











