ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తండ్రి మృతి.. టాలీవుడ్ పెద్దల సంతాపం
Recommended Video
ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తండ్రి ఇంద్రగంటి శ్రీకాంతశర్మ (75) ఈ రోజు (గురువారం) ఉదయం తెల్లవారు జామున కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో భాధ పడుతున్న ఆయన గురువారం ఉదయం 4 గంటల ప్రాంతంలో కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సానుభూతి తెలియజేస్తున్నారు.

ఇంద్రగంటి శ్రీకాంతశర్మ
మోహనకృష్ణ తండ్రి ఇంద్రగంటి శ్రీకాంతశర్మ మొదట జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించారు. ఆ తరువాత రచయితగా మంచి పేరు తెచ్చుకున్న ఆయన.. ఆల్ ఇండియా రేడియో విజయవాడ కేంద్రంలో పనిచేశారు. పలు కథలు, నాటకాలు, గేయాలు, సినీ గీతాలు శ్రీకాంత్ శర్మ రచించారు.

పలు సినిమాల్లో పాటల రచయితగా
ఇంద్రగంటి శ్రీకాంతశర్మ పలు సినిమాలకు పాటలు కూడా రాశారు. కృష్ణావతారం, నెలవంక, రెండు జళ్ల సీత, పుత్తడిబొమ్మ లాంటి సినిమాల్లో ఆయన రాసిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. కొడుకు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సమ్మోహనం సినిమాలో ‘మనసైనదేదో' అనే రొమాంటిక్ సాంగ్ ఆయన రాసిన చివరి పాట.

ఈ రోజు సాయంత్రం అల్వాల్లో అంత్యక్రియలు
తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో ఇంద్రగంటి శ్రీకాంత శర్మ 1944 వ సంత్సరం మే 29 వ తేదీన ఆయన జన్మించారు. ఆ తర్వాత వృత్తి రిత్యా ఆయన హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. ఈ రోజు సాయంత్రం అల్వాల్లో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

సినీ ప్రముఖుల సంతాపం
మంచి మనిషిగా, సాహితీ వేత్తగా మంచి పేరు తెచ్చుకున్న ఇంద్రగంటి శ్రీకాంతశర్మ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతూ కొడుకు ఇంద్రగంటి మోహనకృష్ణకు ధైర్యం చెబుతున్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ ప్రస్తుతం నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రలతో 'V' అనే చిత్రం తెరకెక్కిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











