Bheemla Nayak వ్యక్తిగత కక్షతో సినీ పరిశ్రమను చంపేస్తున్నారు.. జగన్ సర్కార్పై ప్రధానికి మోదీకి RRR ఫిర్యాదు
తెలుగు సినిమా పరిశ్రమపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ రఘురామరాజు నిరసన వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమతో వ్యవహరిస్తున్న తీరును, అధికారులు వేధింపులు, ఇతర అరాచకాలను ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లారు. సినీ పరిశ్రమ భ్రష్టు పట్టించేలా వ్యవహరిస్తున్నారని ప్రధాని మోదీకి లేసిన లేఖలో తెలిపారు. రాఘురామ రాజు (RRR) రాసిన లేఖలో ఏ విషయాలను ప్రస్తావించారంటే..
Recommended Video

సినీ పరిశ్రమపై ఏపీ ప్రభుత్వం దాడి
సృజనాత్మకతతో కూడిన తెలుగు సినిమా పరిశ్రమపై ఏపీ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతున్నది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల వల్ల వేలాది మంది కళాకారులు, వారి కుటుంబాల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి అని లేఖలో రఘురామ రాజు తెలిపారు. సినిమా పరిశ్రమ అభివృద్ది కోసం దేశవ్యాప్తంగా అటల్ బీహారి వాజ్పేయ్ ప్రభుత్వం ఎన్నో పథకాలను, పాలసీలను తీసుకొచ్చింది. అలాంటి పాలసీలను తుంగలో తొక్కే ప్రయత్నం జరుగుతున్నది. వ్యక్తిగత కక్షలతో సినిమా ఇండస్ట్రీని చంపే ప్రయత్నం చేస్తున్నది అంటూ పేర్కొన్నారు.

టాలీవుడ్పై జగన్ సర్కార్ కక్ష
కోవిడ్ పరిస్థితుల తర్వాత తెలుగు సినిమా పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఓటీటీలు, పైరసీలతో తెలుగు సినిమా మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిర్మాతలు భారీ బడ్జెట్తో దేశం గర్వించే విధంగా సినిమాలను రూపొందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం తెలుగు సినిమా పరిశ్రమపై కక్ష కట్టినట్టు వ్యవహరిస్తున్నది. టికెట్ రేట్ల విషయంలో జోక్యం చేసుకొంటూ నిర్మాతలు వేధిస్తున్నది. ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వకుండా ఆంక్షలు విధిస్తున్నది అని రఘురామరాజు పేర్కొన్నారు.

నిర్మాతలను టార్గెట్ చేస్తూ
కోవిడ్తో కుదేలైన తెలుగు పరిశ్రమను ఏపీ ప్రభుత్వం వేధిస్తున్నది. థియేటర్లలో 5, 10, 25 రూపాయల టికెట్ రేట్లు పెట్టి నిర్మాతలకు ఇబ్బందిని కలిగిస్తున్నది. దీంతో సినిమా పరిశ్రమకే కాకుండా ఎగ్జిబిటర్లకు, థియేటర్ యాజమన్యాలు, సినీ కార్మికులకు అన్యాయం జరుగుతున్నది అని రఘురామరాజు తాను రాసిన సుదీర్ఘమైన లేఖలో తెలిపారు

ఒక కాకి చనిపోతే.. మిగితా కాకులు
వ్యక్తిగత కక్షతో పవన్ కల్యాణ్ను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తుంటే కనీసం సినిమా పరిశ్రమ నుంచి ఒక్కరు కూడా ముందుకు వచ్చి సపోర్ట్ చేయడం లేదు. ఒక కాకి చనిపోతే మిగిలిన కాకులన్నీ గుంపుగా వచ్చి గొడవ చేస్తాయి. ఒక సినిమా పరిశ్రమలో ఉండి.. తొటి నటుడికి అన్యాయం జరుగుతుంటే నోర్లు మూసుకొని ఉన్నారు అని రఘురామరాజు అన్నారు.

సినీ ప్రముఖులకు సిగ్గు లేదా?
ఏపీలో థియేటర్లపై రెవెన్యూ అధికారులు దాడులు చేస్తున్నారు. కొన్ని చోట్ల థియేటర్లను మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇలా చేస్తే ఏపీలోని ప్రేక్షకులు తెలంగాణకు వచ్చి సినిమా చూస్తారు. తెలంగాణలో టికెట్ కలెక్షన్లు డబుల్ అవుతాయి. ఇలాంటి దారుణాలపై ఓ ఒక్కరు ప్రశ్నించడం లేదు సినిమా ప్రముఖులకు సిగ్గులేదా అని రఘురామరాజు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి ప్రాధేయపడటం కాదు.. సినిమాల్లో మీరు కొడితే వందమంది లేచిపోతారు. అలాంటి స్టామినా ఉన్న మీరు ప్రభుత్వంపై దెబ్బ కొట్టండి అంటూ ఆవేశపడిపోయారు.

పోరాడితే పోయేది ఏమీ లేదు..
మీ సినిమా పరిశ్రమను మీరు కాపాడుకోవాలి. ఓ హీరో సినిమాకు అన్యాయం జరుగుతుంటే మీరంత ఏకం కావాలి. మీరు ఒకరికొకరు మద్దతు తెలుపుకోవాలి. పోరాడితే పోయేది ఏమీ లేదు. కక్షతో ఒళ్లు మరిచిపోయి ప్రవర్తిస్తున్న ఏపీ ప్రభుత్వం.. ఇలాంటి పనులు మానుకోవాలని సీఎం జగన్ను కోరుతున్నాను. ఐదో ఆటకు అనుమతి ఇవ్వండి ఇవ్వండి అని రఘురామరాజు కోరారు.


Click it and Unblock the Notifications











