‘ఎంఎస్ ధోని-ది అన్ టోల్డ్ స్టోరీ’ పిచ్ రిపోర్ట్
హైదరాబాద్: ఇండియన్ క్రికెట్ చరిత్రలో టాప్ ప్లేయర్ల లిస్టు అయినా.... టాప్ కెప్టెన్ల లిస్టు అయినా సరే అందులో తప్పకుండా ఉండే పేరు మహేంద్ర సింగ్ ధోనీ. 2011లో టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన వేళ ఇండియన్ క్రికెట్ అభిమానుల సంబరాలు ఆకాశాన్నంటాయి. జట్టుకు సారథ్యం వహించిన ధోనీ నేషనల్ హీరో అయ్యాడు.
ధోనీ ఒక గొప్ప క్రికెటర్ గా, కూల్ కెప్టెన్ గా మాత్రమే మనకు తెలుసు. అతని వ్యక్తి గత జీవితం, కుటుంబ నేపథ్యంలో ఎవరికీ తెలియదు. ధోనీకి ఎలాంటి క్రికెట్ బ్యాగ్రౌండ్ లేదు. ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు.

ఒక సాధారణ కుటుంబంలో జన్మించి
క్రికెట్ స్టార్ల పిల్లలు, బోలెండత డబ్బు ఖర్చు పెట్టి ప్రత్యేకంగా శిక్షణ పొందిన ధనవంతులు పిల్లలు సైతం అందుకోలేని అవకాశాలు... ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ధోని ఎలా అందుకున్నాడు? అనేది ఎంతో ఎంతో ఆసక్తికరం.

ఎలాంటి రిస్క్ చేసాడు?
చిన్నతనం నుండే క్రికెటే తన జీవితంగా పెరిగిన ఒక కుర్రాడు. పరిస్థితులకు తలొగ్గి భారతీయ రైల్వేలో టికెట్ కలెక్టర్ గా ఉద్యోగంలో చేరి... తన లక్ష్యాన్ని చేరడానికి ఎలాంటి రిస్క్ చేసాడు? టీమిండియాలో చోటు దక్కించుకుని, కెప్టెన్ గా అవకాశం అందింపుచ్చుకుని, భారత్ కు మరోసారి వరల్డ్ కప్ అందించడానికి ఎలాంటి వ్యూహాలు అనుసరించాడు.... ఇవన్నీ సినిమా రూపంలో ప్రేక్షకుల ముందు ఆవిష్కరించబోతున్నారు దర్శకుడు నీరజ్ పాండే.

భారత క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా
మహేంద్ర సింగ్ ధోనీ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఎంఎస్. ధోనీ-ది అన్ టోల్డ్ స్టోరీ' చిత్రం సెప్టెంబర్ 30న ప్రపంచ వ్యాప్తంగా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా ఎప్పుడొస్తుందా? అని భారత క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

గ్రాండ్ రిలీజ్
సినిమా భారీ డిమాండ్ ఉండటంతో రిలీజ్ కూడా అదే రేంజిలో భారీగా చేసారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, ఇంగ్లీషులో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతోంది. తొలిరోజు దాదాపు 4 వేల థియేటర్లలో సినిమా రిలీజవుతోంది.

ధోనీ జీవితంలో మనకు తెలియనివి
ఈ సినిమాలో ధోనీ జీవితంలో ఇప్పటి వరకు ఎవరికీ తెలియని అంశాలెన్నింటినో చూపించబోతున్నారు. కేవలం అతని క్రికెట్ జీవితం మాత్రమే కాదు... వ్యక్తిగత జీవితం, కుటుంబం, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, భార్యకు సంబంధించిన అంశాలు కూడా ఉండబోతున్నాయి.

సుశాంత్ సింగ్
ధోనీ బయోపిక్ అంటే... తెరపై ధోనీని చూసిన ఫీలింగే కలగాలి. ఎవరో నటుడు వచ్చి నటించి వెళ్లి పోయాడు అనే ఫీల్ రాకూడదు. ధోనీ పాత్రలో అతడు పరకాయ ప్రవేశం చేసినట్లు ఉండాలి. అందుకే తాను అనుకున్న పాత్రకు సరైన నటుడ్ని ఎంచుకునేందుకు దర్శకుడు నీరజ్ పాండే చాలా కసరత్తే చేసాడు.

రాటుదేలిన తర్వాతే
ధోనీ పోలికలు సరితూగడంతో పాటు అతని బాడీ లాంగ్వేజ్ కు సూటయ్యే నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ రూపంలో లభించాడు. సుశాంత్ కూడా ఏదో నటించామని కాకుండా పాత్రలో జీవించడానికి చాలా కష్టపడ్డాడు. కొన్ని నెలల పాటు శిక్షణ తీసుకున్నాడు. ధోనీలా నడవటం, అతనిలా క్రికెట్ షాట్లు కొట్టడం, ఇలా ధోనికి సంబంధించిన అన్ని అంశాల్లో శిక్షణ తీసుకుని రాటుదేలిన తర్వాతే సినిమా ప్రారంభించారు.

భారీ అంచనాలు
సినిమా ట్రైలర్ రిలీజైన తర్వాత, అందులో సుశాంత్ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. దేశ వ్యాప్తంగా ఈ సినిమా క్రేజ్ ఓ రేంజిలో పెరిగిపోయింది. అందుకు తగిన విధంగానే ప్రమోషన్లు నిర్వహించారు. స్వయంగా ధోనీ వచ్చి సినిమాను ప్రమోట్ చేయడం విశేషం. ధోనీ భార్య సాక్షి రావత్ పాత్రలో కైరా అద్వానీ నటిస్తున్నారు. భూమిక చావ్లా, దిశా పటాని కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











