ఊహించని వివాదం...క్షమాపణ చెప్పారు
న్యూఢిల్లీ: మహిళలు గౌరవప్రదమైన (డిగ్నిఫైడ్) దుస్తులను ధరించాలంటూ నటుడు, నిర్మాత, తెదేపా ఎంపీ మురళీమోహన్ చేసిన వ్యాఖ్యలు గురువారం లోక్సభలో దుమారం లేపాయి. టాలీవుడ్ సినిమా వర్గాల్లోనూ ఇదే విషయం చర్చనీయాంశంగా మారింది. మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడిన మురళీమోహన్ క్షమాపణ చెప్పాలని, ఆయనను సభ నుంచి బయటకు పంపాలని పలువురు మహిళా ఎంపీలు డిమాండు చేశారు. 'మహిళలపై, పిల్లలపై వేధింపులు' అనే అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ వివాదం నెలకొంది.
రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్ ప్రసంగిస్తూ.. ప్రపంచంలో అమ్మను మించిన ప్రేమ మూర్తి మరెవరూ లేరన్నారు. సమాజంలో తల్లిగా, భార్యగా, చెల్లిగా, కుమార్తెగా ఎన్నో కీలకమైన పాత్రలు పోషించే మహిళను అందరూ గౌరవించాల్సిన అవసరముందన్నారు. కానీ ఆమెకు తగిన గౌరవం దక్కటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధునిక భారతంలో మహిళలు రాష్ట్రపతిగా, ప్రధాని, స్పీకర్, ప్రతిపక్ష నేతగా గొప్ప పాత్రలను పోషిస్తూ వస్తున్నారన్నారు. ఇలాంటి తరుణంలో మహిళలపై అత్యాచారాలు, వరకట్న వేధింపులు, హత్యలు, యాసిడ్ దాడులు జరగడం దారుణమని పేర్కొన్నారు. ఆయన తన ప్రసంగాన్ని ముగిస్తూ.. 'మన భారతీయ సంస్కృతిని కాపాడటానికి గౌరవప్రదమైన దుస్తులను ధరించాలని నా సోదరీమణులకు, కుమార్తె సమానులకు, బాలికలకు అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా'' అని పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలపై మహిళా కాంగ్రెస్ ఎంపీలు కుమారి సుస్మితా దేవ్, రణ్జీత్ రంజన్, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే తదితరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, సభను అపహాస్యం చేసిన ఆయన్ను బయటకు పంపాలని డిమాండు చేశారు. దీనిపై సభాపతి స్థానంలో ఉన్న హుకుం సింగ్ స్పందిస్తూ.. ''మీతో ఏకీభవిస్తున్నా. ఇలా జరిగి ఉండకూడదు. ఈ విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం'' అని సభ్యులను శాంతపరిచే ప్రయత్నం చేశారు.
సభలో తాను చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే వెనక్కి తీసుకుంటానని మురళీమోహన్ స్పష్టం చేశారు. లోక్సభలో వివాదం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చర్చలో భాగంగా మహిళల ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని వివరిస్తూ చివర్లో చిన్న విజ్ఞప్తి చేశానన్నారు. మన సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని గౌరవ ప్రదమైన దుస్తులు వేసుకుంటే మంచిదనే మాటను తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు.
ఒకవేళ ఎవరికైనా తప్పనిపిస్తే ఆ మాటలను వెనక్కి తీసుకోడానికి సిగ్గుపడనని, క్షమాపణలు చెప్పడానికి కూడా సిద్ధమని ఆయన తెలిపారు. సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మురళీమోహన్ మహిళల వస్త్రధారణపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎంపీ వి.హనుమంతరావు విమర్శించారు.


Click it and Unblock the Notifications











