అదీ బాలయ్య మంచితనం : కానీ చెడే ఎక్కువ ప్రచారంలోకి....
టాలీవుడ్ అగ్రహీరో బాలకృష్ణ విషయంలో చాలా మందిలో ఓ అపోహ ఉంది. ఆయనకు కోపం ఎక్కువ అని, ఎప్పుడూ అహంకారంగా ఉంటారని అంటుంటారు. ఆ మధ్య సోషల్ మీడియాలో ఫ్యాన్స్పై చేయిచేసుకోవడం, వారిపట్ల దురుసుగా ప్రర్తించడం లాంటి వీడియోలు కూడా ఇలాంటి అపోహలు ఏర్పడటానికి ఓ కారణం.

బాలయ్య వ్యక్తిత్వం అలాంటిది కాదు
కానీ వాస్తవానికి బాలయ్య వ్యక్తిత్వం అది కాదు. ఆయన కల్మషం లేని మనిషి. ఆయన అభిమానులను ఎంతగానో గౌరవిస్తారు. ఎవరికైనా సహాయం చేయాల్సి వచ్చినపుడు ముందుంటారు. ఒకటి రెండు సందర్భాల్లో కొందరు వ్యక్తుల ప్రవర్తన నచ్చక బాలయ్య ఆయా సందర్భాల్లో అలా ప్రవర్తించి ఉంటారే తప్ప, అంతకు మించి ఆయనలో నెగెటివ్ ఏమీలేదు అనేది ఆయన సన్నిహితులు మాట.

మరుగున పడిన మంచి
బాలయ్య విషయంలో చెడు విషయాలు త్వరగా వ్యాప్తి చెందాయి. మంచి మరుగున పడింది. బాలయ్య ప్రతి నిత్యం ఎన్నో మంచి పనులు చేస్తుంటారు. ఎంతో మందికి సహాయం చేస్తుంటారు. అయితే ఇవన్నీ సందర్భం వస్తే తప్ప బయటకురావు. తాజాగా విజయవాడలో జరిగిన ‘జై సింహ' ఆడియో వేడుకలో అలాంటి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి.

బాలయ్య దేవుడు
బాలయ్యను అభిమానులు దేవుడులా కొలుస్తుంటారు. బాలయ్య మంచితనమే అభిమానుల్లో ఆయన్ను దేవుడిని చేసింది. ‘జై సింహా' ఆడియో వేడుకలో బాలయ్య చేసిన మంచి పనుల గురించి మురళీ మోహన్, శివాజ రాజా లాంటి వారు చెప్పడంతో ఫ్యాన్స్ మరింత పొంగి పోయారు.

అమ్మాయి ప్రాణాలు కాపాడిన బాలయ్య
‘జై సింహ' ఆడియో వేడుకలో మురళీ మోహన్ మాట్లాడుతూ... బాలయ్య మంచి తనం గురించి ఎంత చెప్పినా తక్కువే. మావూరి అమ్మాయికి క్యాన్సర్ వస్తే డాక్టర్లు లాస్ట్ స్టేజీ, లాభం లేదు తీసుకెళ్లండి అని చెప్పారు. వ్యాను కూడా మాట్లాడాం. అపుడు బాలయ్య బాబు వచ్చి చూసి ఆ పాప గ్యారంటీగా బ్రతుకుతుంది అని చెప్పారు. నీకు ఇది తగ్గిపోతుంది అని ధైర్యం చెప్పారు. 20 రోజుల తర్వాత ఆ అమ్మాయి పూర్తిగా క్యాన్సర్ తగ్గిపోయి మా ఊరికి వచ్చింది. అదీ బాలయ్య చల్లదనం... అని చెప్పారు.

బాలయ్య కృషి అభినందనీయం
బాలయ్య బాబు తరచూ క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్లి క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసుకున్న పిల్లల దగ్గరకు వెళ్లి రకరకాల ఆట వస్తువులు, మిఠాయిలు పంచి వారితో కూడా చాలా సరదాగా ఉంటారు. ఈ రోజు క్యాన్సర్ అనేది మహమ్మారి అయిపోయింది. అలాంటి క్యాన్సర్ నయం చేయడం కోసం బాలయ్య బాబు చాలా కృషి చేస్తున్నారు. దేశ విదేశాల నుండి ఫండ్స్ తెస్తున్నారు. ఈ విషయంలో బాలయ్య అభినందనీయుడు అని మురళీ మోహన్ తెలిపారు.

శివాజీ రాజా మాట్లాడుతూ...
నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ.... ప్రార్థించే చేతులకన్నా, సహాయం చేసే చేతులు గొప్పవి. ‘జై సింహ' ఆడియో వేడుకకు హాజరైన అభిమానుల సమక్షంలో ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. క్యాన్సర్తో ఎన్నాళ్లో బ్రతకను అనే పరిస్థితిలో ఒక చిన్న ఆర్టిస్టు ఉంటే.... నేను వెంటనే బాలయ్య బాబుకు ఫోన్ చేశాను. ఆయన 9.30 గంటలకు పడుకుంటారని తెలుసు. అయినా రాత్రి 10.30 గంటలకు ఫోన్ చేశాను. ఏం కావాలి శివాజీ చెప్పు అన్నారు. క్యాన్సర్ తో బాధ పడుతున్న నటుడి గురించి చెబితే మా ఆసుపత్రిలో చేర్పిద్దాం నేనూ వస్తా అన్నారు. ఎదుటివారికి సహాయం చేసే విషయంలో బాలయ్య ఎంత చొరవ తీసుకుంటారో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ. ఆ నటుడికి క్యాన్సర్ తగ్గిపోయి బయటకు వచ్చిన తర్వాత నా దగ్గరకి వచ్చి.... నా ఆయుష్సు, నా పిల్లల ఆయుష్సు బాలయ్య బాబుకు ఉండాలి, ఈ విషయం ఆయనకు చెప్పండి అన్నారు. ఇంత మందిలో చెబుదామని ఆ విషయం ఇన్నాళ్లు దాచుకున్నాను, అందుకే ఆ విషయం ఇపుడు చెబుతున్నాను....అని శివాజీ రాజా అన్నారు.


Click it and Unblock the Notifications











